కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారం కోసం పోరాడుతోందా లేక ఉన్న ప్రతిపక్ష హోదాను కూడా చేచేతుల నాశనం చేసుకోవాలనుకుంటుందా.? అన్న సందేహాలు నానాటికి పెరుగుతున్నాయి. భారత్ తో చిరకాల శత్రుత్వాన్ని కాంక్షించే పాకిస్తాన్ మీద కాంగ్రెస్ నాయకుల ప్రేమ మరి దాచుకోలేనంతగా పెరిగిపోతుందా.?
అందుకే ఇలా బహిరంగంగా, బరితెగించి పాకిస్తాన్ పై ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారా.? అయితే ఒకటి పాకిస్తానీయులు కాంగ్రెస్ నేతలను ప్రశంసిస్తారు లేకుండా కాంగ్రెస్ నాయకులే పాకిస్తాన్ కు మద్దతుగా ప్రకటనలు చేస్తారు.
మొన్న పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక నేడు కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చైర్మన్ సామ్ పిట్రోడా పాకిస్తాన్ లో ఉంటే తన సొంత ఇంట్లో ఉన్న భావన కలుగుతుందంటూ పాక్ కి అనుకూలంగా వ్యాఖ్యానించారు.
మన విదేశాంగ విధానంలో మొదట మన పొరుగు దేశాల పై ద్రుష్టి పెట్టాలని, పొరుగు దేశాలతో మంచి తత్సంబంధాలను కొనసాగించడం అవసరమని, తానూ భారత పొరుగు దేశాలైన బంగ్లా, పాకిస్తాన్, నేపాల్ కు వెళ్ళినప్పుడు సొంత ఇంటికి వెళ్లిన భావనే కలుగుతుందంటూ చెప్పుకొచ్చారు.
అయితే సామ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు తీవ్ర విమర్శలను తెచ్చిపెట్టింది. ఒక పక్క పాకిస్తాన్ భారత ప్రజలను టార్గెట్ చేస్తూ పెహాల్గమ్ వంటి ఉగ్రదాడులకు పాల్పడుతుంటే మరో పక్క కాంగ్రెస్ నేత రాహుల్ కి అత్యంత సన్నిహితుడు సామ్ ఇలా పాకిస్తాన్ను తన సొంత ఇంటితో పోల్చడం అది భారత్ ను అవమానించినట్టే అవుతుంది.
నాటి పెహల్గమ్ దాడికి ప్రతి చర్యగా టీం ఇండియా గ్రౌండ్ లో కనీసం పాకిస్తాన్ ప్లేయర్స్ కి షాక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇక ఇటు భారత జవాన్లు తమ సొంత ఇంటిని వదిలి ప్రాణాలను పణంగా పెట్టి పాకిస్తాన్ కుట్రల నుంచి భారత్ ను సురక్షితంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు.
కానీ కాంగ్రెస్ నాయకులేమో పాకిస్తాన్ మా సొంత ఇల్లు, ఆపరేషన్ సింధూర్ కి ఆధారాలు చూపించండి అంటూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ కు అనుకూలంగా ప్రసంగాలు సాగిస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు దేశంలో కాంగ్రెస్ ను మరింత పతనం దిశగా తీసుకెళ్తాయి.
మోడీ వంటి శక్తివంతమైన నాయకుడితో రాహుల్ ఢీ కొట్టాలి అనుకున్నప్పుడు ఇటువంటి నేతలను పూర్తిగా పక్కన పెట్టాల్సిందే. లేకుంటే బీజేపీ ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్ పాక్ కు అనుకూలమే అనే భావన సర్వత్రా బలపడిపోయే ప్రమాదం ఉంది.
సామ్ పిట్రోడా గతంలో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసి విమర్శలు మూటకట్టుకున్నారు. అయినా ఈ సీనియర్ నేతకు ఇంకా తత్త్వం బోధపడలేదేమో బహుశా..!





