ప్రస్తుతం ఉన్న సినీ హీరోలలో పవన్ కళ్యాణ్ కు ఉన్నంత సామాజిక దృక్పధం మరో హీరోకు లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే, ‘జనసేన’ ద్వారా రాజకీయ తెరంగ్రేటం చేసినా, క్రియాశీలక రాజకీయాల్లో భాగస్వామి కాకపోవడంతో నిరుత్సాహంలో ఉన్న అభిమానులు, కార్యకర్తలకు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చే పలు విషయాలు ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నేతలు ప్రస్తావించడం విశేషం.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలంగాణా ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ‘జనసేన’ అధినేత గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ‘ప్రజారాజ్యం’ పార్టీ ప్రచారంలో ఉన్న సమయంలో ఆదిలాబాద్ జిల్లా, నార్నూరు అనే గ్రామం దగ్గరికి పవన్ తో పాటు తానూ కూడా ప్రయాణించానని, అక్కడ ఊర్లో దిగగానే ఒక బోరు, దాని నుండి ఒక కిలోమీటర్ మేరకు బిందెలు లైన్ లో ఉన్నాయని, అక్కడే ఓ ముసలావిడ కూడా బిందె పట్టుకుని ఉండగా, ఆమెను తోసేస్తూ వేరేవాళ్ళు నీళ్ళు తీసుకెళ్తున్నారని, అలా మొత్తం ఉదంతం చూసి తమ రూమ్స్ కు వెళ్ళిపోయామని శ్రవణ్ తెలిపారు.
ఇద్దరివి పక్క పక్క గదులే కాగా, తెల్లవారుజామున తలుపు కొట్టిన శబ్దం వినపడిందని, ఎవరో అని చూస్తే పవన్ కళ్యాణ్ అని, తన దగ్గరకు వచ్చి… ‘నాకు ఈ మినరల్ వాటర్ తాగలనిపించడం లేదు, వాళ్ళేమో గుక్కెడు నీళ్ళ కోసం అలా కష్టపడుతూ ఉంటే, మనమేమో మినరల్ వాటర్, ఏదొకటి చేయాలి…’ అని అప్పటికప్పుడు అనుకుని, మొత్తం పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులతో కేవలం రెండు రోజుల్లో బోరు ఏర్పాటు చేసాము, తానూ కేవలం సహాయ సహకారాలు మాత్రమే అందించాను అని తెలిపారు.
అయితే ఆ ఊర్లో అప్పటికే చాలా బోర్లు వేసాము గానీ, ఎక్కడా మంచి నీళ్ళు రాలేదని, కేవలం పవన్ కళ్యాణ్ త్రవ్వించిన బోరులో మంచి నీరు పడిందని, అదేమీ మహత్యమో గానీ ఆశ్చర్యాన్ని ప్రకటించిన శ్రవణ్, ఒక నాయకుడికి కావాల్సిన సున్నితమైన లక్షణాలు పవన్ వద్ద ఉన్నాయని, అందుకే ‘జనసేన’ను తామేమీ తక్కువ అంచనా వేయడం లేదని పేర్కొన్నారు. సదరు సంగతులు తెలుసుకున్న పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి హద్దేముంటుంది. దటిజ్ పవన్ కళ్యాణ్… అంటూ కాలర్ ఎగరేయడం తప్ప..!



