హైదరాబాద్ ఫిలింనగర్ లో దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. కల్చరల్ క్లబ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం పునాదులతో సహా కుప్పకూలగా, శిథిలాల కింద పదుల సంఖ్యలో కూలీలు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సహాయ చర్యలను ప్రారంభించి, కూలిన భవనం శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమై ఉన్నారు.
ఎంత మంది చిక్కుకుపోయి ఉంటారన్న దానిపై స్పష్టమైన సమాచారం లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తున్న అంశం. అయితే దాదాపు నాలుగు కుటుంబాలకు చెందిన 20 మంది వరకూ ఉండవచ్చని అంచనా వేస్తుండగా, ఇప్పటివరకూ రెండు మృతదేహాలను వెలికితీశారు. భవన నిర్మాణంలో కాంట్రాక్టరు నాసిరకం సిమెంటును వాడటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాధమిక అంచనా వేస్తున్నారు.
ఈ సంఘటనతో జూబ్లీహిల్స్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. శిథిలాల కింద ఎవరైనా ప్రాణాలతో ఉండి ఉండవచ్చని, సాధ్యమైనంత త్వరగా కాంక్రీట్ శ్లాబులను పగులగొట్టి మొత్తం శిథిలాలను తొలగిస్తామని మునిసిపల్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్ అందుబాటులోకి రాకపోవడంతో పోలీసులు ఆ దిశగా కూడా విచారణ సాగిస్తున్నారు.



