ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఈరోజు విజయవాడలో బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మరోసారి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈసారి కూడా ఆమె గణాంకాలతో సహా వివరించి జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. ఆమె ఏమ్మన్నారంటే…
1. జగన్ ప్రభుత్వం ఈ నాలుగేళ్ళలో చేసిన అప్పు రూ. 7,14,631 కోట్లు. దీనిలో అధికారికంగా రిజర్వ్ బ్యాంక్ నుంచి చేసిన అప్పు రూ.2,39,716 కోట్లు. ఇక ఈ నాలుగేళ్లలో అనధికారికంగా చేసిన అప్పు రూ. 4,74,315 కోట్లు. ఈ అప్పుల గురించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తూనే ఉంది. రాష్ట్రానికి వచ్చిన ఆదాయంలో 40 శాతం పైగా వడ్డీలకే పోతుంటే మిగిలిన దానితో రాష్ట్రాన్ని ఏవిదంగా అభివృద్ధి చేయగలరని ప్రశ్నిస్తున్నాము.
2. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన రూ.8,800 కోట్లు జగన్ ప్రభుత్వం దారి మళ్ళించడంతో గ్రామాలలో కనీస మౌలిక వసతులు కల్పించలేని దుస్థితి ఏర్పడింది.
3. ఏపీ హైకోర్టులో వివిద అంశాలకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వంపై రెండు లక్షల పైచిలుకు కేసులున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కలిపి 28,468 కోర్టు ధిక్కార కేసులుంటే ఒక్క ఏపీలోనే 11,348 కోర్టు ధిక్కార కేసులున్నాయి. అంటే దేశం మొత్తం మీద ఉన్న కేసులలో 40 శాతం కోర్టు ధిక్కార కేసులు మన ఏపీలోనే జగన్ ప్రభుత్వంపైనే ఉన్నాయంటే ఇక పాలన ఏవిదంగా సాగుతోందో అర్దం చేసుకోవచ్చు.
4. బిజెపి-జనసేన పార్టీలు కలిసే ఉన్నాయి. కలిసే పనిచేస్తాయి. ఇటీవలే నేను ఏపీ బిజెపి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాను. అదే సమయంలో పవన్ కళ్యాణ్గారు వారాహి యాత్రలో ఉన్నందున నేను వారిని కలవలేకపోయాను. త్వరలోనే కలిసి ఉమ్మడి కార్యాచరణ గురించి చర్చిస్తాను.
దగ్గుబాటి పురందేశ్వరి సందించిన విమర్శలు, ప్రశ్నలు అన్నీ సహేతుకమైనవే అని రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. అయితే కేంద్ర ప్రభుత్వం సహాయసహకారాలు లేనిదే జగన్ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేయలేదు కదా? సిఎం జగన్మోహన్ రెడ్డి అడిగిందే తడువుగా అప్పులు ఇప్పిస్తున్నది కేంద్రమే కదా?కేంద్రం వద్ద ఇన్ని గణాంకాలు ఉంచుకొని కూడా జగన్ ప్రభుత్వాన్ని ఇంతకాలం ఎందుకు అడగలేదు? అప్పులు చేయకుండా ఎందుకు అడ్డుకోలేదు?నాలుగేళ్ళు సహకరించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని రేపు వైసీపీ నేతలే అడగకుండా ఉంటారా?
గ్రామ పంచాయితీలకు ఇచ్చిన నిధులను జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని తెలిసి ఉన్నప్పుడు కేంద్రం ఎందుకు నీలదీయలేదు?ఎందుకు ఇస్తోంది?
కోర్టు కేసులు, కోర్టు ధిక్కార కేసుల గురించి కూడా దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడటం ఏదో ముందస్తు వ్యూహంలో భాగమే అనిపిస్తుంది. త్వరలో పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడుతానని చెప్పడం మంచిదే.




