జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్ళపాటు సంక్షేమ పధకాల పేరుతో వేరుశనక్కాయలా ఓటరు మహాశయులకు డబ్బు పంచిపెట్టారు.
కనుక ఆ విశ్వాసంతోనే 175/175 సీట్లు వచ్చేస్తాయని బల్లగుద్ది వాదించారు. ఆ దెబ్బకు సీలింగ్ ఫ్యాన్ ఊడిపడి బల్ల విరిగింది. ఇప్పుడు చర్చ ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి కాదు.
మనకే ఖచ్చితంగా 175/175 సీట్లు వస్తాయని అంత నమ్మకంగా చెపుతున్నప్పుడు, సింగిల్ సింహం టీడీపి-జనసేనలు, టీడీపి-బిజేపి పొత్తులు పెట్టుకుంటే ఎందుకంత ఆందోళన చెందింది?
వాటి మద్య పొత్తు ఏర్పడకుండా అడ్డుకోవాలని ఎందుకు పరితపించింది? నేటికీ ఎందుకు పరితపిస్తోంది? అని ప్రశ్నించుకుంటే, 175/175 ఓ పెద్ద భ్రమ.. కూటమి ప్రభుత్వం ఓ చేదు నిజమని జగన్మోహన్ రెడ్డికి మాత్రమే తెలుసు గనుక.. అని అనుకోవాలేమో?
కూటమిలో బాబు-పవన్, పవన్-లోకేష్, కమ్మ-కాపు ఇలా రకరకాల కాంబినేషన్లో తాళం తెరిచేందుకు పాపం ప్రయత్నిస్తూనే ఉంది. అలాగే నందమూరి కుటుంబాన్ని రకరకాలుగా హ్యాండిల్ చేస్తూనే ఉంది. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించే వరకు క్రీడాకారులు ఏవిధంగా నిరంతరం శ్రమిస్తుంటారో, అదేవిధంగా వైసీపీ కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు నిరంతరంగా ఈ ‘చిచ్చు యజ్ఞం’ కొనసాగిస్తూనే ఉంటుంది.
ఇంతకీ విషయం ఏమిటంటే, వైసీపీ దృష్టిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తమ అధికారానికి గండి కొట్టిన ఓ పెద్ద విలన్. కనుక ఆయనపై రాళ్ళు, బాణాలు వేస్తూనే ఉంటారు.
కానీ అయన అన్న చిరంజీవిని మాత్రం ‘అసమదీయుడు’గా భావిస్తుండటమే కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః చిరంజీవి ‘న్యూట్రల్ స్టాండ్’లో వైసీపీకి ఏదో కనిపిస్తున్నట్లుంది. కనుక నేటికీ చిరంజీవిని ‘అసమదీయ బ్యాచ్ మెంబర్’గానే పరిగణిస్తున్నారు.
అందుకే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని నేడు గుడివాడలో తన అభిమానులతో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.
దీనినే మరోవిధంగా చూస్తే ‘అటు నుంచి వీలు కాకపోతే, ఇటు నుంచి నరుక్కు రావాలనే’ ప్రయత్నంగా కనిపిస్తుంది. కూటమి, నందమూరి కుటుంబం తర్వాత వైసీపీ దృష్టి ఇప్పుడు మెగా ఫ్యామిలీపై పడిందేమో? కనుక మెగా జాగ్రత్త అవసరమే.





