కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్తో శాసనసభ, లోక్సభ సీట్లు భారీగా పెరుగుతాయి. దీంతో అన్ని పార్టీలలో రాజకీయ నిరుద్యోగులకు ఎంపీ, ఎమ్మెల్యే పదవులు లభిస్తాయి. కనుక ప్రజల సంగతి ఎలా ఉన్నా రాజకీయ పార్టీలకు ఇది చాలా సంతోషకరమైన విషయమే.
కనుక దేశవ్యాప్తంగా అనేక ప్రాంతీయ పార్టీలు, అలాగే టీడీపి, జనసేన వంటి ఎన్డీయే భాగస్వాములు కూడా దీనిని స్వాగతిస్తున్నాయి. అలాగే అవినీతి కేసులు, రాజకీయ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై ఆధారపడున్న వైసీపీ, బీఆర్ఎస్ వంటి దేశంలో అనేక పార్టీలు కూడా మద్దతు పలికే అవకాశం ఉంది.
కనుక పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదింపజేసుకోవడానికి కేంద్రానికి అన్ని విధాల అనుకూల వాతావరణం ఉందనే భావించవచ్చు.
కానీ తెలంగాణ, తమిళనాడు సిఎంలు రేవంత్ రెడ్డి, స్టాలిన్ వంటి కొందరు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ 50 శాతం సీట్ల పెంపుతో ఉత్తరాది రాష్ట్రాలలో లోక్సభ సీట్లు గణనీయంగా పెరుగుతాయి. అప్పుడు దక్షిణాది రాష్ట్రాల ఓట్లు, సీట్లు అవసరం లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కాగలదు. అంటే ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పార్టీలు, నేతలే దేశాన్ని ఏలుతారు. లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు ఉన్నప్పటికీ వారు ప్రేక్షకులుగా మిగిలిపోతారు.
కనుక కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్కే మొగ్గు చూపితే, ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మద్య దూరం ఇంకా పెరుగుతుంది. ఈ ప్రతిపాదనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి సలహాలు, అభిప్రాయాలు, అంగీకారం తీసుకొని ముందుకు వెళ్ళాలి. కాదని మొండిగా ముందుకు వెళ్తే కలిసివచ్చే పార్టీలతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం,” అని రేవంత్ రెడ్డి, స్టాలిన్ హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాగా, స్టాలిన్ పార్టీ డీఎంకేతో కాంగ్రెస్కి పొత్తు ఉంది. రేవంత్ రెడ్డి ఈ సమస్య తీవ్రత, నష్టాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి కూడా వివరించారు. ఆయన వాదనలతో కాంగ్రెస్ అధిష్టానం ఏకీభవించినందునే రేవంత్ రెడ్డి దీనిని ఇంత గట్టిగా వ్యతిరేకిస్తున్నారని భావించాల్సి ఉంటుంది.
కానీ కాంగ్రెస్ పార్టీకి కూడా ఉత్తరాది రాష్ట్రాలలోనే మంచి పట్టుంది. బలమైన ఓటు బ్యాంక్ ఉంది. కనుక ఈ అంశంపై పార్లమెంటు లోపల, బయటా అది పోరాటాలు చేస్తుందా.. లేదా? రేవంత్ రెడ్డి పోరాటాలకు మద్దతు ఇస్తుందా లేదా? రాబోయే రోజుల్లో చూడొచ్చు.




