జగన్‌… మరోసారి ఆ మాట అంటే కబడ్దార్!

deputy cm Pawan Kalyan

అదుపు తప్పిన వైసీపి సోషల్ మీడియాపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేస్తుంటే, జగన్మోహన్‌ రెడ్డి తన సోషల్ మీడియా కార్యకర్తలను వారించి గాడిన పెట్టకుండా వారిపై కేసులు నమోదు చేస్తున్నందుకు ఐపీఎస్ అధికారులని బెదిరిస్తున్నారు.

ఈ ప్రభుత్వం మహా అయితే మరో 3-4 ఏళ్ళు అధికారంలో ఉంటుందని ఆ తర్వాత మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతానని అప్పుడు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ప్రతీకార చర్యలు తప్పవని జగన్‌ హెచ్చరించారు.

ADVERTISEMENT

డిజిపి ద్వారకా తిరుమల రావు పదవీ విరమణ చేసిన తర్వాత పొరుగు రాష్ట్రానికి వెళ్ళిపోతే తనను ఎవరూ ఏమీ చేయలేరని అనుకుంటున్నారని కానీ విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

అదేవిదంగా తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు కూడా తప్పించుకోగలనని అనుకుంటున్నారని కానీ సప్త సముద్రాల అవతల దాకున్నా పట్టుకువచ్చి చర్యలు తీసుకుంటానని జగన్‌ హెచ్చరించారు.

ఇది ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి రావడంతో తీవ్రంగా స్పందించారు. నేడు గుంటూరులో అటవీశాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు. ముఖ్యమంత్రిగా చేసిన జగన్‌ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కనుక మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి. కానీ తమ విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బెదిరిస్తున్నారు.

ఈసారి కనుక జగన్‌తో సహా ఎవరైనా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బెదిరిస్తూ మాట్లాడిన్నట్లయితే వారిపై సుమోటో కేసులు నమోదు చేయిస్తాము,” అని పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరించారు.

“ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఈగ వాలినా సహించను. ప్రభుత్వంలో భాగంగా రాష్ట్రం, ప్రజల కోసం పనిచేస్తున్న అధికారులని ఈవిదంగా బెదిరించడం సరికాదు. అధికారులకు రాజకీయాలతో సంబంధం లేదు. వారి డ్యూటీలు వారు చేస్తున్నారు,” అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

ఏపీలో అధికార టిడిపి కూటమి, వైసీపి మద్య పోలీస్ శాఖ నలిగిపోతోంది. వైసీపి నేతలు పేట్రేగిపోతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తిన్నట్లు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారంటూ నాలుగైదు రోజుల క్రితమే ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోపక్క పోలీసులు, అధికారులు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లకు తొత్తులుగా మారి వైసీపి నేతలను, కార్యకర్తలను వేదిస్తున్నారంటూ జగన్మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనుక ప్రస్తుత రాజకీయాలలో పోలీసుల పని కత్తి మీద సాములాగే మారిందని చెప్పవచ్చు. కనుక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనవలసి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories