ఏపీ పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు మూడు నెలలు మీడియాకు దూరంగా ఉండిపోయారు. మొదలుపెట్టిన సినిమాలు కూడా పూర్తిచేయలేదు.
కానీ తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం మొదలైన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ తరచూ మీడియాలో కనిపిస్తూ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఇప్పుడు ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన ఇంకా మీడియా ఫోకస్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఈరోజు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీకి బయలుదేరబోతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. కానీ దేనికి?అనే చర్చ అప్పుడే మొదలైంది.
రాష్ట్ర హోంమంత్రి అనిత వంగలపూడి సమర్ధంగా వ్యవహరించలేకపోతున్నారంటూ ఇటీవల పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ పవన్ కళ్యాణ్ విమర్శించారు.
వైసీపి అధినేత జగన్, వైసీపీ నేతలు, వారి సోషల్ మీడియా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయంటూ వాదిస్తూనే ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలను తప్పించుకోవడానికి జగన్ తన పార్టీ నేతలతో కలిసి ఢిల్లీలో ధర్నా కూడా చేసిన సంగతి తెలిసిందే.
కనుక ఈ అంశంపై చర్చించేందుకు పవన్ కళ్యాణ్ని ఢిల్లీకి పిలిచారా లేదా రాష్ట్ర రాజకీయాలలో ఆయనకు మార్గదర్శనం చేసేందుకు పిలిచారా?
లేదా మహారాష్ట్రలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనవలసిందిగా కోరేందుకు ఢిల్లీకి పిలిచారా లేదా మరేదైనా కారణం ఉందా? అనేది పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళాక తెలుస్తుంది. కారణం ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన అంత తేలికగా కొట్టిపదేశే విషయమైతే కాదనే భావించవచ్చు.




