బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. ఏపీలోని చంద్రబాబు సర్కార్ ను విమర్శించే క్రమంలో ‘జనసేన’ అధినేతను రాజకీయంగా, వ్యక్తిగతంగా ఏకేసే ప్రయత్నం చేసారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, ప్రభుత్వం నుండి అందాల్సిన సంక్షేమ పధకాలు ప్రజలకు లభించడం లేదని, ప్రజలు ఆవేదన చెందుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
‘జనసేన’ పార్టీ వ్యవస్థాపన సమయంలో ప్రజల పక్షాన పోరాడతానని గొప్పలు చెప్పుకున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఏపీ సర్కార్ తీరుపై స్పందించకపోవడం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో విమర్శలతో పాటు ఏకంగా పార్టీనే రద్దు చేయాలన్న డిమాండ్ ను తెరపైకి తీసుకురావడం విశేషం. ‘జనసేన’ పార్టీని ఎన్నికల సంఘం రద్దు చేయాలని, ప్రజల తరపున ప్రభుత్వాన్ని అడగని పార్టీ ఎందుకని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.
రాజకీయ విమర్శలతో పాటు ఇప్పటికే పవన్ పై ఉన్న వ్యక్తిగత మచ్చలలోనూ బీసీ సంఘం అధ్యక్షుడు తన విమర్శలను ఎక్కుపెట్టారు. కట్టుకున్న భార్యకు, పుట్టిన బిడ్డకు కూడా న్యాయం చేయలేని పవన్ కళ్యాణ్, ప్రజలకు ఏం చేస్తారంటూ తీవ్ర పదజాలంతో స్పందించారు. అయితే ఉన్నట్లుండి పవన్ కళ్యాణ్ పై ఈ రేంజ్ లో మండి పడడానికి గల కారణాలు ఏమిటో రాజకీయంగా అర్ధం కాని పరిస్థితి నెలకొంది.
ప్రస్తుతం రాజకీయ వాతావరణం స్తబ్దుగా ఉంది. ప్రభుత్వం తన కార్యకలాపాలలో నిమగ్నమవ్వగా, ప్రజలకు దూరంగా ఉండే ప్రతిపక్ష పార్టీ ఆలోచనలు అలాగే కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో పవన్ పై విమర్శలు చేయాల్సిన అవసరం ఏమిటి అన్న ప్రశ్నకు… రాజకీయంగా ‘పబ్లిసిటీ’ అన్న సమాధానం ఒక్కటే తారసపడుతోంది. పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే మీడియా పరంగా ప్రాధాన్యత దక్కుతుంది గనుక, పవన్ పై ఫోకస్ చేసారన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.



