పొదిలి, రెంటపాళ్ళలో వైసీపీ కార్యకర్తల వీరంగం చూసినప్పుడు వారిపై జాలి కలుగుతుంది. బాబాయ్ వివేక, సొంత చెల్లి వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మలతో ఆయన ఏవిదంగా వ్యవహరించారో కళ్ళారా చూసినప్పటికీ వైసీపీ కార్యకర్తలు జగన్ కోసం రోడ్లపైకి వచ్చి దౌర్జన్యాలు చేస్తుండటం, కేసులు నమోదైతే పోలీస్ స్టేషన్లు, కోర్టులు చుట్టూ తిరుగుతుండటం, జైలు పాలవుతున్నారు. కనుక వారిపై జాలి కలుగుతుంది.
తన అన్న జగన్కు తోడబుట్టిన చెల్లి కంటే, రాజకీయ అవసరాల కోసం కేసీఆర్తో స్నేహమే ముఖ్యమనుకున్నారని, ఇద్దరూ కలిసి తనని ఎంతగానో వేధించారని వైఎస్ షర్మిల నిన్ననే విశాఖలో మీడియాకు చెప్పుకొని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు.
వైఎస్ కుటుంబంలో మూడు తరాల అనుబందం ఉన్న విజయసాయి రెడ్డిని సైతం జగన్ విడిచిపెట్టలేదు. జగన్ చేస్తున్న అవమానాలు భరించలేక పార్టీ వీడానని ఆయన చెపుకున్నారు.
తెలంగాణ ఉద్యమాలు జోరుగా సాగుతున్న సమయంలో ఆ రాష్ట్రంలో వైసీపీ నేతలు, జగన్ని నమ్ముకొని ఆయన వెంటనడిస్తే, ఆయన వారందరినీ నడిరోడ్డున వదిలేసి ఏపీకి వచ్చేశారు.
2024 ఎన్నికలలో వైసీపీని గెలిపించడం కోసం లక్షల మంది వాలంటీర్లను నియమించుకొని, ఓడిపోయిన తర్వాత వారందరినీ కూడా జగన్ నడిరోడ్డున వదిలేశారు.
ఈవిదంగా తన సొంత కుటుంబ సభ్యులను, పార్టీలో నమ్ముకున్నవారిని కూడా దెబ్బ తీయడానికి వెనుకాడని జగన్ కోసం వైసీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి వీరంగం ఆడి కేసులలో చిక్కుకోవడం చూస్తున్నప్పుడు, గొర్రె కసాయివాడినే నమ్ముతుందనే లోకోక్తి గుర్తుకు రాక మానదు.
వారిని అంతగా నమ్మించి వెంట తిప్పుకోగలగడం, తన కోసం కేసులు మెడకు తగిలించుకునేందుకు సిద్దపడేలా చేయడం, తమ భవిష్యత్ని, చివరికి తమ కుటుంబాలను, జీవితాలను కూడా పణంగా పెట్టేందుకు వైసీపీ కార్యకర్తలు సిద్దపడుతున్నారంటే, అది జగన్ తెలివితేటలనుకోవాలా లేదా వారి అజ్ఞానం అనుకోవాలా?
జగన్ ట్రాక్ రికార్డ్ ఇంత జుగుప్సాకరంగా ఉన్నప్పటికీ ఇంత మంది కార్యకర్తలు తన కోసం వారి జీవితాలు పణంగా పెట్టేలా చేయగలగుతున్నారంటే మామూలు విషయం కానే కాదు.
ఇందుకు ఆయనని తప్పక అభినందించాల్సిందే.. కార్యకర్తలపై తప్పక జాలి పడాల్సిందే!






