ఇప్పుడు ఏపీలో అభివృద్ధి… తెలంగాణలో రాజకీయాలు!

CBN Revanth Reddy

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు పూర్తి భిన్నంగా మారిపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. గత 5 ఏళ్ళలో జగన్‌ పాలంలో ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాల విధ్వంసం జరిగేది. ఎప్పుడూ ‘బటన్ నొక్కాను… సంక్షేమ పధకాలకు నిధులు విడుదల చేశాననే’ గోల తప్పితే జగన్‌ నోట రాష్ట్రాభివృద్ధి అనే మాటే వినిపించేది కాదు.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్‌ రెడ్డి చంద్రబాబు నాయుడుపై విపరీతమైన పగ, ద్వేషంతో రగిలిపోతున్నందున ప్రభుత్వం విధానం కూడా అదే అయ్యింది.

ADVERTISEMENT

అందువల్ల రాష్ట్రంలో ఎప్పుడు చూసినా టిడిపి నేతలపై కేసులు, వేధింపులు, భౌతికదాడులు, కూల్చివేతలు, కక్ష సాధింపులే కనబడుతుండేవి… వినబడుతుండేవి. టిడిపి కూడా వైసీపిని ధీటుగానే ఎదుర్కొనేది. కనుక రాష్ట్రంలో ఎప్పుడూ రాజకీయాలు మాత్రమే జరుగుతుండేవి.

అదే సమయంలో తెలంగాణలో కేసీఆర్‌ తన రాష్ట్రాన్ని అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చేసుకుంటూ ఉండేవారు. ఆ రాష్ట్రంలో నిత్యం ఏదో ఓ అభివృద్ధి కార్యక్రమం లేదా ఏదో పెద్ద పరిశ్రమలు, అంతర్జాతీయ కంపెనీలు, వందలు, వేలకోట్ల పెట్టుబడులు వచ్చాయనే వార్తలో లేదా వాటి శంకుస్థానపనలు, ప్రారంభోత్సవ వార్తలే వినపడేవి. కనపడేవి.

ఇప్పుడు రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారడంతో మళ్ళీ పరిస్థితులు తారుమారు అయ్యాయి.

ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌-బిఆర్ఎస్ పార్టీల మద్య ఎడతెగని రాజకీయాలు, వాటిమద్య ఆధిపత్యపోరు, హైడ్రా కూల్చివేతలు, మంత్రుల నోట ఆర్ధిక సమస్యలే వినిపిస్తున్నాయి తప్ప ఇదివరకులా పరిశ్రమలు, పెట్టుబడులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగడం లేదు.

అయితే నేటికీ తెలంగాణకంటే ఆర్ధికంగా ఎక్కువ ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పుడు నిత్యం అభివృద్ధి మంత్రమే వినిపిస్తుండటం విశేషం.

నేడు అమరావతిలో సీఆర్‌డీఏ కార్యాలయం పనులు సిఎం చంద్రబాబు నాయుడు పునః ప్రారంభించారు. డిసెంబర్‌ నుంచి అమరావతి పనులు ప్రారంభం కాబోతున్నాయి. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్, ఏపీ జెన్‌కో కలిసి లక్ష కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో నిర్మించబోతున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌కి నవంబర్‌లో శంకుస్థాపన జరుగుతుంది. డిసెంబర్‌లో విశాఖ రైల్వేజోన్‌కి ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో అభివృద్ధిపనుల జాబితా చాలా పెద్దదే ఉంది. మద్యలో జగన్‌, వైసీపి నేతలు చెవిలో జోరీగల్లా ఇబ్బంది పెడుతున్నా సిఎం చంద్రబాబు నాయుడు అది పట్టించుకోకుండా అభివృద్ధి పనులకే ప్రాధాన్యం ఇస్తుండటంతో ఇప్పుడు ఏపీలో ‘అభివృద్ధి’ అనే పదం ప్రతీరోజూ వినబడుతూనే ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఈ ఆకస్మిక మార్పు ఆశ్చర్యంగానే ఉంది కదా?

ADVERTISEMENT
Latest Stories