జగన్ పరిపాలనను చూసి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకొంటుంటే, పొరుగు రాష్ట్రంలో మంత్రులు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని జాలిగా చూస్తున్నారు. కారణాలు అందరికీ తెలిసినవే.
అయితే జగన్ పాలన యావత్ దేశానికి ఆదర్శంగా సాగుతోందని, మరో 20-30 ఏళ్ళు సిఎం జగన్మోహన్ రెడ్డే ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకొంటున్నారని ఓ మంత్రి అంటారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి కాదగ్గ గొప్ప వ్యక్తి… రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పధకాలను చూస్తున్న ఇతర రాష్ట్రాలలోని ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి కావాలని కోరుకొంటున్నారని మరో మంత్రి అంటారు.
జగన్ భజన చేయకుండా ప్లీనరీని ఊహించుకోవడమే కష్టం. కనుక మంత్రులందరూ నిన్న ప్లీనరీలో సిఎం జగన్మోహన్ రెడ్డిని పొగిడేందుకు పోటీలు పడ్డారు. మనం దేవతలను వారి నామాలతో అష్టోత్తరం, సహస్రార్చనలు చేసుకొంటున్నట్లే, వైసీపీ మంత్రులు కూడా ఒక్కొక్కరు ఒక్కో కొత్త పాయింట్తో ఈ భజన పోటీలలో పాల్గొన్నారు. వారిలో ప్రధమ బహుమతి ఖచ్చితంగా మంత్రి ధర్మాన ప్రసాదరావుకి ఇవ్వాల్సిందే. వేరే ఎవరికి ఇచ్చినా ఆయనకు అన్యాయం చేసినట్లే అవుతుంది.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “పేదల అభివృద్ధి, సంక్షేమం కోసమే తపిస్తూ శ్రమిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కేవలం మూడేళ్ళలోనే ఆయన రాష్ట్రంలో పేదల జీవితాలలో ఇంత వెలుగులు నింపారు. అదే.. ఆయన 50-75 సంవత్సరాల క్రితమే పుట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి ఉంటే నేడు రాష్ట్రంలో పేదల పరిస్థితి ఈవిదంగా ఉండేదా? పేదలకు నేనున్నాననే ధైర్యం చెప్పి సంక్షేమ పధకాలతో వారికి చేయూతనందిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. రాష్ట్రంలో పేద ప్రజలు ఈ రోజు కోసం దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్నారు. వారందరినీ సిఎం జగన్మోహన్ రెడ్డి పైకి తీసుకువస్తున్నారు. కనుక సంపన్నులు కాస్త ఓపిక పట్టాలి.
సిఎం జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని బంధువులకు, శ్రేయోభిలాషులకు పంచి పెట్టాలనుకోలేదు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు పెద్ద పీట వేసి ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇస్తున్నారు. తొలి ఏడాదిలోనే మా ప్రభుత్వం కూలిపోతుందని చాలా మంది చిలక జోస్యం చెప్పారు. కానీ ఎన్ని అవాంతరాలు ఎదురైనా దిగ్విజయంగా మూడేళ్ళు పూతిర్ చేసుకొన్నాము. మరోసారి, ఇంకోసారి కూడా మేమే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాము,” అని అన్నారు.



