ప్రముఖ సినీ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడు సినీ నటుడు దిలీప్ సాక్షులను ప్రభావితం చేసి, సాక్ష్యాధారాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సిట్ అంగమాలి కోర్టుకు తెలిపింది. లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ ఖైదీగా 85 రోజులపాటు జైలులో ఉన్న దిలీప్ అక్టోబర్ 3న కండిషన్ బెయిలుపై విడుదలయ్యాడు.
అనంతరం తన భార్య కావ్య మాధవన్ మాల్ ‘లక్ష్య’లోని ఉద్యోగులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని, దాని కారణంగానే ఇటీవల సాక్షి మాట మార్చాడని సిట్ అధికారులు అంగమాలి కోర్టుకు తెలిపారు. ‘లక్ష్య’లోనే నిందితుల మధ్య లావాదేవీలు, చర్చలు జరిగేవని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
ఇంతలో సాక్షి మాట మార్చడానికి తోడు, కేసులో విచారణను సీబీఐకి బదిలీ చేయాలని దిలీప్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ రెండూ ఆయన బెయిల్ నిబంధనలు ఉల్లంఘించడమేనని వారు న్యాయస్థానానికి తెలిపారు. మరోవైపు బెయిల్ నిబంధనల్లో భాగంగా కోర్టుకు సరెండర్ చేసిన పాస్ పోర్టును ఇవ్వాలని, దుబాయ్ లో తన వ్యాపార సంస్థను ప్రారంభించేందుకు వెళ్లాలని చెబుతూ కోర్టుకు దిలీప్ పిటిషన్ దాఖలు చేశారు.



