‘పవర్’ వంటి కమర్షియల్ సక్సెస్ తో కెరీర్ ను ఆరంభించిన దర్శకుడు బాబీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో దారుణ పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ను త్రిపాత్రాభినయంలో చూపిస్తూ “జై లవకుశ” సినిమాను తెరకెక్కిస్తోన్న బాబీ, అభిమానులు ఏర్పాటు చేసిన ‘బుడ్డోడు’ పుట్టినరోజు వేడుకలకు హాజరైన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు.
‘వాస్తవానికి జూనియర్ కూడా ఒక పార్టీ ఏర్పాటు చేసారని, అయితే ఫోన్ చేసి ఇలా ఫ్యాన్స్ ఒక పార్టీ ఏర్పాటు చేసారు అని చెప్పగా, ముందు అక్కడికి వెళ్లి తర్వాత ఇక్కడికి రమ్మంటే వచ్చానని’ ప్రారంభించిన బాబీ ప్రసంగం ఆద్యంతం ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తూ సాగింది. తెలుగు నాట తారక్ జన్మించడం మన అదృష్టమని, గత 47 రోజులుగా రెండవ టేక్ అడుగుదామంటే అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారని ఎన్టీఆర్ నటనను ఉద్దేశిస్తూ కీర్తించారు.
“సెట్స్ కు నవ్వుకుంటూ రావడం, తన పని మాత్రమే తను చూసుకోవడం తప్ప, ఇతరుల పనుల్లో వేలు పెట్టడం గానీ, చూడడం గానీ ఏమీ ఉండవు” అని బాబీ చెప్పగానే… అక్కడున్న అభిమానులంతా ‘జై ఎన్టీఆర్ జైజై ఎన్టీఆర్’ అంటూ నినాదాలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. అప్పటివరకు సైలెంట్ గా ఉన్న ‘యంగ్ టైగర్’ అభిమాన గణం ఎందుకు అంతలా స్పందించారు అన్నది జగమెరిగిన సత్యమే!
బాబీ గత చిత్రం పవన్ కళ్యాణ్ తో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో బాబీకి స్వేఛ్చ లభించలేదని, అంతా పవన్ కళ్యాణ్ చూసుకున్నారని, అందుకే సినిమా ఆ స్థాయిలో వచ్చిందన్న ప్రచారం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా! పరోక్షంగా దీనిని సమర్ధించే విధంగా బాబీ వ్యాఖ్యలు ఉండడంతో, బుడ్డోడు అభిమానులు నినాదాలతో హోరెత్తించారు.
అయితే పవన్ పై ఇలాంటి ఆరోపణలు ఒక్క బాబీ నుండి ప్రారంభమైనవి కాదన్న విషయం తెలిసిందే. పవన్ నటించిన చాలా సినిమాలలో జోక్యం ఎక్కువగా ఉంటోందన్న ప్రచారం బాగా బలంగా జరిగింది. తాజాగా బాబీ చేసిన వ్యాఖ్యలు వాటిని ధృవీకరించాయి అంతే! మరి ఈ వ్యాఖ్యలతో పవన్ అభిమానులతో బాబీకి ఏం చిక్కు వచ్చిపడుతుందో అన్న రీతిలో సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.



