గత కొన్ని సంవత్సరాలుగా ప్రిన్స్ మహేష్ బాబుతో ఓ సినిమాను రూపొందించాలని తమిళ దర్శకుడు లింగుస్వామి విశ్వ ప్రయత్నాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ‘ఆవారా’ సినిమాతో మొదలైన లింగుస్వామి కధల ప్రస్థానం ఎప్పటికప్పుడు నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. అయితే తమిళ దర్శకులకు పెద్దగా అవకాశాలు ఇవ్వని ప్రిన్స్, లింగుస్వామి ప్రయత్నాలను కూడా సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు.
ఇక, ప్రిన్స్ తో తీయడం ఇప్పట్లో సాధ్యం కాదు అనుకున్నారో ఏమో గానీ, మెగా హీరో అల్లు అర్జున్ తో లింగుస్వామి ఓ సినిమాకు సిద్ధమవుతున్నారని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాదు, ‘సరైనోడు’ తర్వాత బన్నీ నటించే చిత్రం కూడా ఇదేనని, తెలుగు తమిళ భాషల్లో నిర్మాణం జరుపుకోనుందని సమాచారం. ఏప్రిల్ లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుండగా, తెలుగు వర్షన్ ను గీతా ఆర్ట్స్, తమిళ వర్షన్ ను స్టూడియో గ్రీన్ సంస్థలు నిర్మించనున్నాయని తెలుస్తోంది. మొత్తానికి తెలుగులో నేరుగా ఒక చిత్రానికి దర్శకత్వం వహించాలనే లింగుస్వామి కోరిక అయితే నెరవేరినట్లే!



