వైసీపీ వైలెన్స్…జగన్ సైలెన్స్…వై.?

YSRCP Violence Politics

పార్టీ నేతలు తప్పుదారిలో ఉంటే సరిద్దాల్సిన అధినేత, పార్టీ క్యాడర్ తప్పటడుగులు వేస్తుంటే తప్పనిచెప్పాల్సిన అధినాయకుడు ఆయన మౌనంతో పార్టీలోని వైలెన్స్ ను పెంచి పోషిస్తున్నారు. వై.? అనే సందేహం సాధారణ ప్రజానీకం నుండి కూడా వ్యక్తమవుతోంది.

గతంలో ప్రత్యర్థి పార్టీ నాయకులను, ఆయా పార్టీల కార్యకర్తలను భౌతిక దాడులతో, వ్యక్తిగత విమర్శలతో, సోషల్ మీడియా పోస్టులతో భయపెట్టి బెదిరించిన వైసీపీ పోను పోను సొంత కుటుంబ సభ్యులను కూడా వదిలి పెట్టకుండా వేధించింది.

ADVERTISEMENT

అయితే దాని ఫలితం ఇప్పుడు వైసీపీ రాజకీయంగా అనుభవిస్తున్నప్పటికీ ఆ పార్టీ అధినేత దగ్గర నుంచి క్యాడర్ వరకు ఏ ఒక్కరు వాస్తవాన్ని అర్ధం చేసుకోలేక ఇప్పటికి అదే వైలెన్స్ విధానాలను కొనసాగిస్తూ జగన్ 2.0 రప్ప రప్ప అంటూ వైసీపీ వైలెన్స్ 2.0 ని ప్రజల కళ్ళ ముందుకు తెస్తున్నారు.

ఈ నెల 21 న జగన్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో వైసీపీ క్యాడర్ తమ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ప్రభుత్వంతో, ప్రజలతో చివాట్లు తింటున్నారు. అభిమానం హద్దులు దాటితే దాని పర్యవసానాలు ఎంత వైలెంట్ గా ఉంటాయి అనేదానికి 21 న జరిగిన కొన్ని సంఘటనలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి.

జగన్ పుట్టిన రోజు వేడుకల నిర్వహణలో కొంతమంది జగన్ అభిమానులు, వైసీపీ మద్దతుదారులు బహిరంగంగా జగన్ ఫ్లెక్సీ ల ముందు జంతు బలులు చేస్తూ ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీ కి బొట్టులు పెడుతూ రప్ప రప్ప అంటూ నినాదాలు చేస్తూ స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేసారు.

వేడుకల పేరుతో ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించినా, వారిని తమ నినాదాలతో భయపెట్టాలని చూసిన వారి పై ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశిస్తుంది అంటూ ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికలను సైతం వైసీపీసీ క్యాడర్ బేఖాతరు చేస్తూ రెచ్చిపోయిన విధానాలకు గాను అధికారులు 7 గురు వైసీపీ నాయకులను అరెస్టు చేసారు.

అయితే ఇటువంటి చర్యలు ప్రజామోదాన్ని పొందవని, ప్రజాస్వామ్యంలో రప్ప రప్ప రాజకీయాలకు చోటు ఉండదని, అటువంటి చర్యలను అధినేతగా తానూ ప్రోత్సహించను అంటూ పార్టీ లీడర్లకు, క్యాడర్ కి హితబోధ చెయ్యాల్సిన జగన్ తన నిశ్శబ్దంతో అటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు.

జగన్ సైలెన్స్ వెనుక వైసీపీ లో ఇంత వైలెన్స్ దాగుందా.? వైసీపీ 2.0 విధానాలకు ఈ చర్యలు ప్రత్యక్ష ఉదాహరణలా.? జగన్ మరో ఛాన్స్ రప్ప రప్ప రాజకీయాల కోసమేనా.? అనే ప్రశ్నలు ఏపీ రాజకీయాలను, ఇక్కడి ప్రజలను ఇప్పటి నుంచే భయపెడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories