కనీసం ‘తల్లి’నైనా కనికరిస్తారా.?

YS Vijayamma

రాజకీయాలు బాధ్యతగా కాకుండా అలంకారంగా, అవకాశంగా, వ్యాపారంగా భావిస్తే అవి కుటుంబాలను కూడా నిట్టనిలువునా చీలుస్తాయి అనడానికి వైస్ జగన్ రాజకీయ జీవితమే ఒక చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు.

తన తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టడానికి ఒక పక్క చెల్లి షర్మిల కష్టాన్ని మరో పక్క తల్లి విజయలక్ష్మి మద్దతుని అడ్డుపెట్టుకుని రాజకీయాలలో తననుకున్న లక్ష్యాన్ని చేరుకున్న జగన్ అధికారం చేతికి రాగానే ‘అవసరం తీరాక తెప్పను తగలేసే’ చందంగా తల్లిని పార్టీ గౌరవ అధ్యక్ష పదవి నుండి తప్పించారు, చెల్లిని రాజకీయాల నుండి తప్పుకోమన్నారు.

ADVERTISEMENT

అయితే తన పట్ల తన అన్న చేసిన మోసాన్ని తట్టుకోలేని షర్మిల జగన్ రాజకీయ జీవితానికి పక్కలో బల్లెంలా తయారయ్యింది. దీనితో తన రాజకీయ భవిష్యత్ కు అడ్డొస్తే బాబాయ్ అయినా బాబాయ్ కుటుంబమైనా, సొంత చెల్లైనా ఒకటే అనే చందంగా షర్మిల రాజకీయ జీవితం మొదలు ఆమె వ్యక్తిగత జీవితం వరకు అన్ని మీడియాకెక్కించి వైస్సార్ పరువుని బజారున పెట్టారు జగన్.

ఒక అన్నగా కష్టంలో తోడుగా నిలవాల్సిన జగన్ తన కష్టంలో చెల్లిని అడ్డుపెట్టుకుని చివరికి చెల్లికి కష్టాలనే మిగిల్చారు. షర్మిల రాజశేఖర్ రెడ్డి ప్రత్యర్థులతో చేతులు కలిపింది, చంద్రబాబు వదిలిన బాణంలా తిరిగొచ్చింది, పసుపు చీర కట్టుకుని పచ్చబందానికి దగ్గరయింది, షర్మిల ‘రెడ్డి’ కాదు షర్మిల ‘శాస్త్రి’ అంటూ సాక్షి దాని అనుబంధ మీడియాలో షర్మిలకు వ్యతిరేకంగా కథనాలు వండి వడ్డిస్తున్నారు.

ఇక షర్మిల మీద వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారానికి సొంత చెల్లి మీద ఈ విధమైన ఆరోపణలా అంటూ జగన్ వ్యతిరేకవర్గం కూడా ముక్కున వేలేసుకుతుంది. అసలు వైస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే జగన్ ఊహలో అయినా ఇంతటి సాహసానికి పూనుకుంటారా.? అంటూ జగన్ తీరును ఎండగడుతున్నారు.

తండ్రి పేరు అడ్డం పెట్టుకుని తల్లిని, చెల్లిని కోర్ట్ కీడ్చడం, తనకు అడ్డొస్తే చెల్లినైనా సరే తన వై ‘చీప్’ బ్యాచ్ తో దూషించడం చూస్తుంటే ఇప్పుడు షర్మిలకు మద్దతుగా బయటకొచ్చిన తల్లి విజయమ్మ పరిస్థితేమిటో.? అంటూ విజయమ్మ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

కనీసం జగన్ తల్లినైనా కనికరిస్తారా.? లేక ఆమెకు కూడా వైసీపీ ట్రీట్మెంట్ ఇప్పిస్తారా.? అంటూ తెలుగు ప్రజలతో పాటుగా వైస్సార్ అభిమానులు కూడా జగన్ వేసే నెక్స్ట్ స్టెప్ మీద ఆసక్తిగా గమనిస్తున్నారు. విజయలక్ష్మి ని కూడా బాబు మనిషే, ఆమె రాసిన లేఖ కూడా టీడీపీ స్క్రిప్టే అంటూ తన ఆవు పాఠాన్ని జగన్ మరోమారు ఉటంకిస్తారా.? అనేది అందరి మదిలో మెదిలే ఓ ప్రశ్నే.

అసలు జగన్ కు తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చాలి, వారి గురించి నిత్యం మీడియాలో ఏదోఒక చర్చ జరగాలి అని సలహా ఇచ్చిన ఆ సలహాదారు ఎవరో కానీ ఆయనకు తూర్పుకి తిరిగి దండం పెట్టాల్సిందే. ఇటువంటి చర్యలతో చేచేతుల జగన్ తన రాజకీయ జీవితానికి తానే సమాధి కట్టుకుంటున్నారు అనేది గ్రహించలేకపోతున్నారు.

ఇప్పటికే జగన్ తన ఒంటెద్దు పోకడలతో 151 తో ఉన్న వైసీపీ ని 11 కి పడగొట్టి వైసీపీ రాజకీయంగా పతనం చేసుకున్నారు. ఇక ఇప్పుడు జగన్ చేస్తున్న ఈ దుందుడుకు చర్యలతో వైసీపీ మరో మెట్టు దిగజారడం ఖాయంగా కనపడుతుంది.

ADVERTISEMENT
Latest Stories