ఓ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆ రాష్ట్రంపై ఉంటుంది. అదేవిదంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు యావత్ దేశంపై ప్రభావం చూపుతుంటాయి. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు యావత్ ప్రపంచదేశాల మీద ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చాలా ప్రభావం చూపుతాయి.
అంతటి ప్రభావం చూపగల అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5వ తేదీన జరుగబోతున్నాయి. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఉన్న కమలా హారిస్ డెమొక్రాట్ అభ్యర్ధిగా, మాజీ రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్ధిగా మళ్ళీ అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.
ఇప్పటివరకు వెల్లడించిన సర్వేల ప్రకారం ఇద్దరూ దాదాపు ఉజ్జీలుగానే సాగుతున్నారు. అయితే కొన్నిసార్లు కమలా హారిస్, కొన్నిసార్లు ట్రంప్ సర్వేలలో ముందంజలో ఉంటున్నారు. ప్రస్తుతం ఈ రేసులో ట్రంప్ కంటే కమలా హారిస్ కాస్త ముందున్నట్లు తెలుస్తోంది.
సర్వేల ప్రకారం కమలా హారిస్ కంటే ట్రంప్ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలరని, కనుక అమెరికాలో పురుష ఓటర్లు ఆయనకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు సూచిస్తున్నాయి.
కానీ కమలాకి ప్రవాస భారతీయుయలతో అమెరికన్ మహిళలు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. ఈ విషయం గుర్తించిన ఆమె అమెరికాలో పురుష ఓటర్ల నమ్మకం గెలుచుకునేందుకు తగిన వ్యూహాలు రచించుకొని అమలు చేస్తున్నారు.
ముఖ్యంగా యువ ఓటర్లను ఎవరు ఎక్కువ ఆకట్టుకోగలిగితే వారి విజయావకాశాలు పెరుగుతాయి. కనుక కమలా, ట్రంప్ ఇద్దరూ పోటాపోటీగా యువతని ఆకట్టుకునేందుకు ప్రచారం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో కమల, ట్రంప్ ఇద్దరిలో ఎవరు ఎన్నికైతే భారత్కి, ముఖ్యంగా అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులకి, భారతీయ ఐటి కంపెనీలకు మంచిది? అని ప్రశ్నిస్తే భారతీయ మూలాలు కలిగిన కమలా హారిస్ అని చెప్పవచ్చు.
కానీ ఆమె భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి అయినందునో లేదా ఆమె పార్టీ విధివిధానాల వల్ల భారత్కి ఏదో మేలు కలుగుతుందనో కాక గతంలో ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు భారత్కి, ప్రవాస భారతీయులకి, ఐటి కంపెనీలు ఎదుర్కొన్న కష్టానష్టాలు పునరావృతం కాకూడదంటే కమలా హారిస్ గెలవడమే మంచిదని భావించవచ్చు.




