ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కాకినాడలో సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ను హత్య చేసి, శవాన్ని అతని కుటుంబసభ్యులకు డోర్ డెలివరీ చేసి జైలు పాలయ్యాడు. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జగనన్న కోసం తెలుగుదేశం పార్టీ నేతలపై ఆత్మహుతి దాడికి సైతం సిద్దమని సంచలన ప్రకటన చేశారు.
మూడేళ్ళ జగన్ పాలన పూర్తయిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో టెక్కలిలో జరిగిన ఓ కార్యక్రమంలో హాజరైన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, టిడిపి నేతలను, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మహానాడులో మా జగనన్న గురించి అవాకులు చావాకులు వాగీణ తెలుగుదేశం పార్టీ నేతలందరూ మూల్యం చెల్లించుకోక తప్పదు.
ఆహుతి సినిమాలో విలన్ని గుడ్డలూడదీసి రోడ్డుపై పరిగెత్తించి…పరిగెత్తించి కొట్టినట్లు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఇదే టెక్కలి రోడ్లపై గుడ్డలూడదీసి రోడ్డుపై పరిగెత్తించి కొట్టకపోతే నాపేరు దువ్వాడ శ్రీనివాస్ కాదు. అచ్చెన్నాయుడితో సహా టిడిపి నేతలందరికీ ఇదే నా లాస్ట్ వార్నింగ్. మరోసారి ఎవరైనా మా జగనన్న గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకొనేది లేదు. జగనన్న కోసం ఆత్మహుతి దాడి చేయడానికి కూడా వెనకాడను. నాకు ప్రాణం మీద తీపి, భయం రెండూ లేవు. ఎంతకైనా తెగించడానికి నేను సిద్దం,” అంటూ చాలా ఆవేశంగా మాట్లాడారు.



