మాజీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి మద్యం కుంభకోణం కేసులో ఈ నెల 22న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ నోటీస్ పంపింది. ఇదివరకు అయన ఇదే కేసులో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు హాజరయినప్పుడు ఏవిధంగా స్కాం జరిగిందో, వైసీపీలో ఎవరెవరు ఈ స్కామ్లో ఉన్నారో పేర్లు చెప్పారు. వాటిని వైసీపీ గట్టిగా ఖండించలేకపోయింది.
విజయసాయి రెడ్డి రాజ్యసభ పదవికి, పార్టీకి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకున్నప్పుడు ఇలాంటి కేసుల నుంచి రక్షణ లేదా ఉపశమనం కోసమే అలా చేశారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఈడీ నోటీస్ ఇవ్వడం గమనిస్తే అన్నీ అనుకున్నట్లుగా జరుగలేదా? లేక ఈ కేసులో అంతిమ లబ్దిదారైన జగన్ అరెస్టుకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టిందా? అనే అనుమానం కలుగుతోంది.
జగన్ తాడేపల్లి ప్యాలస్లో నుంచి కాలు బయటకు పెట్టకపోయినా కూటమి ప్రభుత్వాన్ని ‘రప్పారప్పా’ ఆడిస్తూనే ఉన్నారు. మెడికల్ కాలేజీల విషయంలో అడ్డుపడటమే ఇందుకు చక్కటి ఉదాహారణ. ఇటీవల సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే.
వారి భేటీతో జగన్కు ప్రమాద ఘంటికలు మ్రోగవచ్చని ఎం9 అప్పుడే ఊహించింది. ఇప్పుడు జగన్ అంతిమ లబ్దిదారుగా ఉన్న ఈ కేసులో విజయసాయి రెడ్డికి కేంద్ర ప్రభుత్వం అధీనంలో పనిచేసే ఈడీ నోటీస్ పంపడం అటువంటిదే అనిపిస్తోంది.
కనుక ఈడీ విజయసాయి రెడ్డికి నోటీస్ పంపడాన్ని ఈ కేసులో ఆయన ప్రమేయం ఉందా లేదా? అని కనుగొనేందుకు కాక అంతకు మించి మరేదో ఉందనిపిస్తోంది. ఒకవేళ ఈ నోటీస్ అంతిమ లబ్దిదారు కోసం చేస్తున్న సన్నాహాలే అయితే ఇది ఖచ్చితంగా ‘రప్పా రప్పా’ ఎఫెక్టే అనుకోవాల్సి ఉంటుంది. తుంటి మీద కొడితే మూతి పళ్ళు రాలడం అంటే ఇదేనేమో? అవునో కాదో త్వరలో తెలుస్తుంది.






