పోలింగ్ రోజు వరకు కూడా వైసీపి నేతలు రెచ్చిపోతూనే ఉన్నారు. కానీ ఎన్నికలలో ఘోర పరాజయం చెంది, టిడిపి కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో చాలా మంది వైసీపి నేతల నోళ్ళు మూత పడ్డాయి. కేసుల భయంతో కొంతమంది రాజకీయ సన్యాసం ప్రకటిస్తుంటే, కొందరు పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరిపోయేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త పెదబాబు, వైసీపి పట్టణ అధ్యక్షుడు బీ శ్రీనివాస్ తదితరులు మంత్రి నారా లోకేష్ సమక్షంలో మంగళవారం టిడిపిలో చేరి వైసీపికి షాక్ ఇచ్చారు. ఇప్పుడు వైసీపి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ నేడు లేదా రేపు పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. ఆయన సెప్టెంబర్ 6 లేదా 8న టిడిపిలో చేరబోతున్నట్లు తాజా సమాచారం.
అక్రమాస్తుల కేసులో జగన్తో కలిసి చంచల్గూడా జైలులో గడిపి వచ్చిన వ్యక్తి మోపిదేవి. ఆయన వైసీపిని వీడటం ఆ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. జగన్ విదేశీ యాత్రకి విమానం ఎక్కగానే వైసీపిలో కొన్ని రాజీనామాలు ఉంటాయని గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ జగన్ ఇంకా విమానం ఎక్కక ముందే వైసీపిలో రాజీనామాలు మొదలైపోయాయి.
అయితే ఈ రాజీనామాలు వైసీపికి మాత్రమే షాక్ కలిగిస్తాయా?అంటే కాదనే చెపొచ్చు. ఎందువల్ల అంటే ఇంతకాలం టిడిపి నేతలు ఏ వైసీపి నేతలతో పోరాడుతున్నారో ఇప్పుడు వారు ఒకరొకరుగా వచ్చి టిడిపిలో చేరితే చాలా ఇబ్బందిగా ఉంటుంది.
ముఖ్యంగా టిడిపి హౌస్ ఫుల్ అయిన తర్వాత పార్టీలో పలువురు సీనియర్లు, ద్వితీయ శ్రేణి నాయకులు నామినేటడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నప్పుడు, వైసీపి నుంచి వస్తున్నవారు వాటిని తన్నుకుపోతే జీర్ణించుకోవడం చాలా కష్టం.
అయినా ఇప్పుడేమీ ఎన్నికలు లేవు. పైగా టిడిపి కూటమి ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉంది. కనుక టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైసీపి నేతల భరతం పడుతుందనుకుంటే, వైసీపి నేతలని తెచ్చి నెత్తి మీద పెట్టుకోవలసిన అవసరం ఏమిటి?
వారిలో జగన్ కోవర్టులు ఉండరనే నమ్మకం ఏమిటి?అసలు వారి వలన టిడిపికి కొత్త సమస్యలు ఏర్పడటం తప్ప ఏం ప్రయోజనం? అని టిడిపి మద్దతుదారులు సామాజిక మాధ్యమాలలో ప్రశ్నిస్తున్నారు.
వారి ప్రశ్నలు ఆలోచింపజేస్తున్నాయి కూడా. కనుక వైసీపి నేతలు పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరితే వైసీపికి మాత్రమే కాదు… టిడిపి నేతలు, కార్యకర్తలకు కూడా షాక్గానే భావించాల్సి ఉంటుంది. వారి వాదనలను టిడిపి అధిష్టానం కాదనగలదా?




