క్షమాపణలతో వారికి కలిగిన కష్టం, నష్టం తీరుతుందా?

Ex-IAS Praveen Prakash’s Open Apology Shocks AP Politics

జగన్‌ హయంలో ఓ వెలుగు వెలిగిన ఐఏఎస్‌ అధికారులలో ప్రవీణ్ ప్రకాష్ ఒకరు. ప్రభుత్వం మారిన తర్వాత తన పరిస్థితిని ముందే గ్రహించిన ఆయన వీఆర్ఎస్ తీసుకొని గౌరవంగా తప్పుకున్నారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వర రావుకి, మాజీ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌కి తన వలన అన్యాయం జరిగిందని ఒప్పుకున్నారు. అందుకు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పుకున్నారు.

ADVERTISEMENT

నాటి ప్రభుత్వ పెద్దలు వారిరువురి పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నప్పుడు, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్న తాను కూడా ఒత్తిళ్ళకు తలొగ్గి వారికి అన్యాయం చేశానని ప్రవీణ్ ప్రకాష్ అన్నారు.

దాని వలన వారిరువురూ ఉద్యోగపరంగా, సమాజపరంగా, వ్యక్తిగతంగా తీవ్ర క్షోభ అనుభవించారని అన్నారు. తాను పదవీ విరమణ చేసిన తర్వాత ఆత్మపరిశీలన చేసుకున్నానని, తన వల్లనే వారిరువురూ క్షోభకు గురయ్యారనే ఆలోచన తనని నిలువనీయలేదన్నారు.

కనుక వారిరువురికీ ఫోన్‌లో చేసి క్షమాపణలు చెప్పానని కానీ సమాజానికి కూడా ఈవిషయం తెలియాలనే తాను బహిరంగంగా వారిరువురికీ క్షమాపణలు చెపుతున్నానన్నారు ప్రవీణ్ ప్రకాష్.

ఓ ఐఏఎస్‌ అధికారిగా ప్రవీణ్ ప్రకాష్‌ ముఖ్యమంత్రి ఆదేశాలను, అవి తప్పని తెలిసి ఉన్నా అమలు చేయక తప్పదు. అదే చేశారు. అందుకు పశ్చాతాపపడుతున్నారిప్పుడు.

ఆయనలో కనీసం ఏడాది తర్వాత అయినా పశ్చాతాపం కలిగింది. అందుకు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు. కానీ ఈవిదంగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను వేధించడం తప్పని నేటికీ జగన్‌, వైసీపీ నేతలు ఎవరూ భావించడం లేదు. కనుక వారిలో ఎటువంటి పశ్చాతాపం కూడా కనిపించడం లేదు.

పైగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్క ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను గుడ్డలూడదీయించి రోడ్డుపై నిలబెడతామని బెదిరిస్తున్నారు కూడా. దాని కోసం జగన్‌ స్వయంగా ‘డిజిటల్ డెయిరీ’ కూడా ప్రారంభించారు.

అధికారంలో ఉన్నప్పుడు ఎంతటి వారైనా తప్పులు చేయడం లేదా జరగడం సహజం. కానీ అధికారం కోల్పోయినా అవాంచనీయమైన ఈ ధోరణినే కొనసాగిస్తామని హెచ్చరిస్తుండటం వలన, నిర్భయంగా, నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు వెనకడుగు వేస్తే వ్యవస్థలు ఇంకా బలహీనమవుతాయి.

ADVERTISEMENT
Latest Stories