పశ్చిమ బెంగాల్లో బిజేపి, తమిళనాడులో మళ్ళీ డీఎంకే అధికారంలోకి వస్తాయనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లుగానే ఉన్నట్లనిపించాయి.
కానీ రెండు మూడు సర్వేలు మాత్రం రెండు రాష్ట్రాలలో అధికార ప్రతిపక్షాలకు సరిసమానంగా సీట్లు రావచ్చు లేదా ప్రభుత్వ ఏర్పాటుకి తగిన సీట్లు రాకపోవచ్చునని చెప్పడంతో రాజకీయ పార్టీలలో గుబులు మొదలైంది.
పశ్చిమ బెంగాల్లో బిజేపి గెలుస్తుందనే సర్వేలని సిఎం మమతా బెనర్జీ తేలికగా కొట్టిపడేశారు. బిజేపి డబ్బులిచ్చి అలా సర్వేలు ప్రకటింపజేసుకున్నారని ఆక్షేపించారు. ఈసారి 294కి కనీసం 226కి పైగా సీట్లు గెలుచుకొని పూర్తి మెజార్టీతో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
కానీ నిన్న రాత్రి ఆమె పార్టీ నేతలను వెంటేసుకొని నగరంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద చాలా హడావుడి చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసినా, ఓట్ల లెక్కింపులో తేడాలొచ్చినా సహించనన్నారు.
అంటే ఈసారి బిజేపి గెలిచే అవకాశం ఉందని పసిగట్టారా? లేక ఓడిపోతామనే అనుమానమా?అంటే రెండూ అనుకోవాల్సి ఉంటుంది. లేకుంటే పోలింగ్ జరుగుతున్నప్పుడు కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన మమతా బెనర్జీ, ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాక ఇలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కదా?
ఎగ్జిట్ పోల్స్ తర్వాత తమిళనాడులో పార్టీలలో కూడా ఆందోళన మొదలైంది. ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకి తగినన్ని సీట్లు రాకపోతే ఏం చేయాలి? ఎవరిని కలుపుకోవాలి? అని అధికార డీఎంకే, అన్నాడీఎంకేలు రెండూ టీవీకే పార్టీ వైపు చూస్తున్నాయి.
ఆ పార్టీ అధినేత విజయ్ గెలిచిన తన ఎమ్మెల్యేలను ఆ రెండు పార్టీలు ఎత్తుకుపోకుండా లేదా వాటితో తన ఎమ్మెల్యేలు టచ్లో వెళ్ళకుండా అప్పుడే జాగ్రత్త పడుతున్నారు.
మూడు పార్టీలలో అధికార డీఎంకే ఒక్కటే గెలుపుపై కాస్త ధీమాగా కనిపిస్తోంది. ఒకవేళ పొత్తులు అనివార్యమైతే దేనితో జత కట్టాలని టీవీకే పార్టీ అప్పుడే మేధోమధనం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా టీవీకే పార్టీని మచ్చిక చేసుకొని దారికి తెచ్చుకోవాలని బిజేపి ప్రయత్నిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మే 4న ఫలితాలు వెలువడితే పాలకు పాలు… నీళ్ళకు నీళ్ళు అన్నట్లు దేని బలమెంతో తేలిపోతుంది. ఆ తర్వాత అవసరమైతే బేరసారాలు మొదలవుతాయి.




