ఇటీవల పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడిన మాటలతో రాష్ట్రంలో పెద్ద అనర్దం జరిగిపోతుందన్నట్లు హడావుడిగా నోటీస్ పంపించేసిన ఏపీ మహిళా కమీషన్కు ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మావతి, జనసేన కార్యకర్తలు వేసిన 18 ఎదురు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నవ్వులపాలైన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ సోషల్ మీడియా గ్యాంగ్ టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణిపై అసత్య ప్రచారం చేస్తూ ఆమె గౌరవానికి భంగం కలిగిస్తునప్పుడు మాత్రం మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మావతికి అవేవీ కనబడవు. వాటి గురించి తెలియనట్లు ఊరుకొంటారు.
“నారా బ్రాహ్మణి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన రూ.1600 కోట్లు విలువగల భవనం కొనుగోలు చేశారని, ఆమెకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో,” అంటూ వైసీపీ గ్యాంగ్ సోషల్ మీడియా సన్నాయి నొక్కులు నొక్కుతూ అనితారెడ్డి, కొడాలి నాని, ఇంటూరి రవి కిరణ్ పేరిట మూడు ట్వీట్స్ పోస్ట్ చేసింది.
అయితే అవన్నీ అబద్దపు ప్రచారం మాత్రమే అని టిడిపి స్పష్టం చేసింది. సిఎం జగన్మోహన్ రెడ్డిపైన, ఆయన భార్యపైన ఎవరు ఏ ఆరోపణలు చేసినా వెంటనే పోలీసు బలగాన్ని పంపి కేసులు పెట్టించే జగన్ రెడ్డి, స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబంలోని మహిళలపై ఫెక్ ప్రచారాలు చేయిస్తున్నారంటూ టిడిపి ట్విట్టర్లోనే ఘాటుగా స్పందించింది.
తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై నారా బ్రాహ్మణి పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించినట్లు టిడిపి తెలియజేసింది. ఈ అంశంపై టిడిపి నేతలు తక్షణం ఏపీ మహిళా కమీషన్కు ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మావతిని కలిసి ఫిర్యాదు చేస్తే, అప్పుడు మహిళల పట్ల ఆమెకు ఎంత చిత్తశుద్ధి ఉందో తేలిపోతుంది కదా?




