విజయనగరం జిల్లా భోగాపురంలో తొలి విమానం నేడు ల్యాండ్ అయ్యింది. కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం చేరుకున్నారు.
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నడిబొడ్డున భోగాపురం వద్ద ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. ఇది విశాఖ శివారులో విజయనగరం పట్టణానికి అతి సమీపంలో ఉంది. శ్రీకాకుళం హైవేని ఆనుకొని ఉంది. కనుక ఈ మూడు జిల్లాల ప్రజలకు ఈ విమానాశ్రయం చాలా సౌలభ్యంగా ఉంటుంది.
తొలి విమానం ల్యాండ్ అయ్యిందంటే అర్థం భోగాపురం విమానాశ్రయంలోని ‘ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ’ దేశంలో ఇతర విమానాశ్రయాలతో అనుసంధానం అయ్యిందని… ఇక నుంచి కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్దమయిందని! అలాగే కీలకమైన విమానాల రాకపోకలకు అవసరమైన ‘రన్ వే’ నిర్మాణం పూర్తయిందని స్పష్టం చేసింది.
తొలి విమానం దిగింది కనుక ఇకపై ప్రధాని, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి, బహుశః జగన్ కూడా ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించవచ్చు. ఈ ఏడాది జూన్-జూలై నెలల్లోగా భోగాపురం విమానాశ్రయం తొలిదశ నిర్మాణ పనులు పూర్తవుతాయి.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు నాలుగున్నరేళ్ళు భోగాపురం విమానాశ్రయాన్ని పట్టించుకోకుండా వదిలేసి ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు హడావుడిగా మళ్ళీ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.
అంటే ఈ విమానాశ్రయం, పోర్టులు పనులు మొదలుపెట్టి, వాటిని ప్రజలకు చూపించి ఎన్నికలలో గెలవచ్చనే విషయం జగన్ చాలా ఆలస్యంగా తెలుసుకున్నారన్న మాట!
అదే… ఆయన ముఖ్యమంత్రి కాగానే పనులు కొనసాగించి ఉంటే నేడు భోగాపురం నుంచి విమానాల రాకపోకలు సాగుతుండేవి. ఈ క్రెడిట్ జగన్కే దక్కి ఉండేది కదా?






