గుంటూరు నగరంలో తూర్పు, పశ్చిమ రెండు శాసనసభ నియోజకవర్గాలున్నాయి. వాటిలో తూర్పు నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా షేక్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, పశ్చిమ నియోజకవర్గానికి టిడిపి ఎమ్మెల్యే మద్దాలి గిరి ప్రతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన కూడా వైసీపీలో చేరిపోవడంతో రెండు నియోజకవర్గాలు వైసీపీ చేతిలోనే ఉన్నాయి.
ఇంతకాలం బాగానే సాగిపోయింది. కానీ మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఈ రెండు నియోజకవర్గాలలో ఎవరికి ఇవ్వాలనే దానిపై జిల్లా ఇన్ఛార్జ్ విజయసాయి రెడ్డి ఇటీవల సమీక్షా సమావేశం జరిపారు. తూర్పు నియోజకవర్గం మహమ్మద్ ముస్తఫా షేక్ పనితీరు, ఐప్యాక్ నివేదిక అన్నీ బాగానే ఉన్నందున మళ్ళీ ఆయనకే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. అయితే ఈసారి తనకు బదులు తన కుమార్తె షేక్ నూరి ఫాతిమాకు అవకాశం ఇవ్వాలని ముస్తాఫా జగన్ను అభ్యర్ధించారు. కనుక విజయసాయి రెడ్డి సమీక్షా సమావేశంలో చర్చించి ఆమెకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు.
కానీ గుంటూరు పశ్చిమ టికెట్ కోసం గత ఎన్నికలలో పోటీ చేసి మద్దాలి గిరి చేతిలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్ధి ఏసు రత్నంకి జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా నేటికీ ఆయననే పశ్చిమ ఇన్ఛార్జ్గా కొనసాగిస్తున్నారు. కనుక మళ్ళీ తనకే ఎమ్మెల్యే టికెట్ వస్తుందనే నమ్మకంతో ఆయన నియోజకవర్గంలో పనిచేసుకొంటున్నారు. నియోజకవర్గంలో కులాల లెక్కల ప్రకారం చూసినా మళ్ళీ తనకే టికెట్ గ్యారెంటీ అను ఏసురత్నం నమ్మకంగా ఉన్నారు.
విజయసాయి రెడ్డి సమీక్షా సమావేశంలో వీరిద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయం తేల్చకుండానే సమావేశం ముగించారు. కనుక గుంటూరు పశ్చిమలో వీరిద్దరి మద్య టికెట్ కోసం పోటీ నెలకొంది. ఒకవేళ ఏసురత్నంకే టికెట్ కేటాయిస్తే టిడిపిలో నుంచి వైసీపీలోకి వెళ్ళిన మద్దాలి గిరి పరిస్థితి ఏమిటి?



