రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికలలో కూటమి పార్టీలు, వైసీపీ పోటీ పడగా కూటమి గెలిచింది. సిఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు, అమరావతి, పోలవరం, ఏపీ అభివృద్ధి గురించే ఎక్కువ ఆలోచించారు తప్ప వైసీపీ.. దాని అధినేత జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళలేదు.
అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కేసీఆర్, బీఆర్ఎస్ మంత్రులు, అలాగే జగన్ వైసీపీ నేతలు ఎంతగా రెచ్చగొడుతున్నా వారి జోలికి వెళ్ళలేదు.
కానీ కేసీఆర్, జగన్ చేతులు కలిపి 2019లో చంద్రబాబు నాయుడుని గద్దె దించేసి భుజాలు చరుచుకున్నారు. అంతటితో వారు శాంతించి ఉంటే వారిరువురికీ నేడు ఈ దుస్థితి ఎదురయ్యేదే కాదు.
కానీ జగన్ ముఖ్యమంత్రికాగానే చంద్రబాబు నాయుడు, టీడీపి నేతల వెంటపడి వేధించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరినీ వారి ఇంట్లో ఆడవాళ్ళని కూడా టార్గెట్ చేసి అనుచితంగా మాట్లాడారు. చాలా దుర్మార్గంగా వ్యవహరించారు.
టీడీపి, జనసేన కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. చంద్రబాబు నాయుడుతో సహా పలువురిని జైల్లో పెట్టారు. ఎంపీ రఘురామ కృష్ణారాజుని చిత్రహింసలు పెట్టి పైశాచికానందం పొందారు.
అమరావతి రైతులు, పారిశ్రామికవేత్తలు, ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులను, ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను వేధించారు. చివరికి తమ కోసమే పనిచేసిన వాలంటీర్లను కూడా ముప్పతిప్పలు పెట్టి రోడ్డున పడేసి పోయారు. వీటన్నిటికీ తోడు రాజకీయ, పాలనాపరమైన తప్పిదాలు వాటి బాధితులు ఉండనే ఉన్నారు.
హిందువులు పరమపవిత్రంగా భావించే తిరుమల స్వామివారితో అనేక దేవాలయాలలో చేయకూడని అపచారాలెన్నో చేశారు.
ఇలా ఇంతమంది మహిళలు, రైతులు, కార్యకర్తలు, సామాన్య ప్రజల ఉసుర్లు, దేవుళ్ళ శాపాలు జగన్కి తగిలాయి. అందువల్లే ఆ దేవుడు కూడా స్క్రిప్ట్ లో 175కి బదులు 11 అని వ్రాశాడు.
కనుక చెడపకురా చెడేవు అని పెద్దలు ఊరికే అనలేదని అర్ధమవుతోంది. కానీ నేటికీ జగన్, కేసీఆర్ల అహంకారం ఏమాత్రం తగ్గలేదు. కేసీఆర్ తోలు తీస్తానంటే., జగన్ రప్పా రప్పా తలకాయలు నరుకుతామని హెచ్చరికలు చేయిస్తున్నారు. అంటే కేసీఆర్, జగన్ ఇద్దరూ ఇంకా కర్మఫలం పూర్తిగా అనుభవించలేదని అర్ధమవుతోంది. అది ఎలా ఉంటుందో?






