ఎవరికి వారు ‘నేనే సూత్రధారిని… కథంతా నేనే నడిపిస్తున్నా…’ అని అనుకుంటారు. కానీ ఈ జగన్నాటకంలో తాము ‘కేవలం పాత్రధారులే’ అని తెలుసుకోలేరు. తెలుసుకునేసరికి చాలా ఆలస్యమవుతుంది. ఇది వేదాంతం అనిపించవచ్చు. కానీ జీవిత సత్యం కూడా. ఇందుకు ఓ చిన్న ఉదాహరణ…
ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు చాలా వేడిగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధి హామీ పథకాంలో ‘గాంధీ’ పేరు తొలగించింది.
గాంధీజీ పేరు తొలగించినందుకు ప్రధాని మోడీ దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ లోపలా, బయటా ఆందోళనలు జరుగుతున్నాయి. ఉభయ సభలను స్థంభింపజేస్తున్నాయి.
ఈ పరిణామాలను గమనిస్తే, కాంగ్రెస్ మిత్రపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ స్థంభించిపోయింది. గాంధీ పేరు తొలగిస్తే దేశ ప్రజలకు, ముఖ్యంగా గుజరాత్, ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకు మోడీ ప్రభుత్వంపై ఆగ్రహం కలుగుతుంది. కనుక ఈ హడావుడితో కాంగ్రెస్, మిత్రపక్షాలకు కాస్త ఆ రాజకీయ మైలేజ్ కూడా లభిస్తుంది. కనుక కేంద్ర ప్రభుత్వం గాంధీ పేరు తొలగించి వాటికి అడ్డంగా దొరికిపోయినట్లు కనిపిస్తుంది.
కానీ ఈ పరిణామాలను మరింత నిశితంగా గమనిస్తే, కాంగ్రెస్ మిత్రపక్షాలను ఇతర అంశాల మీద నుంచి డైవర్ట్ చేయడానికే పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యే ముందు కేంద్ర ప్రభుత్వం ఈవిధంగా చేసి ఉండవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఇలాంటిదేదో ఒకటి అందిస్తే చాలు… దానిని పట్టుకొని అల్లుకుపోతుందని ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలకు బాగా తెలుసు. గాంధీతో చలగాటం ఆడితే తమకే నష్టం అని వారికి తెలియదా? అంటే బాగా తెలుసు. దేశ ప్రజలు ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోరు. కనుక బీజేపికి ఇబ్బందేమీ ఉండదు. ఒకవేళ ఉంటుందని భావిస్తే పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత తమ నిర్ణయం వెనక్కు తీసుకున్నామని ప్రకటించవచ్చు.
కనుక వారు ఉద్దేశ్యపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీకి ఈ గాంధీజీ అస్త్రం అందించి ఉండవచ్చు. వారు ఊహించినట్లే కాంగ్రెస్ మిత్రపక్షాలు దేశంలో మరే సమస్యా లేదన్నట్లు దీంతో కాలక్షేపం చేస్తున్నాయి. కానీ తాము కేంద్ర ప్రభుత్వం ఉచ్చులో చిక్కుకున్నామని గ్రహించడం లేదు.
కనుక ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం రెంటిలో సూత్రధారి ఎవరు? పాత్రధారి ఎవరు?






