లాజిక్ ఉన్న సినిమాలు ఆడతాయి లేనివీ ఆడతాయి.. ప్రేక్షకులను మెప్పించగలిగితే! ప్రస్తుతం కల్తీనెయ్యిలో కనపడకుండా కలిసిపోయిన లాజిక్ కోసం అందరూ వెతుకుతున్నారు. వారిలో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఒకరు.
ఆయన చరిత్ర పుటలు తిరగేసి ఓ లాజిక్ వెతికి పట్టుకున్నారు. దాంతో తమ అధినేత జగన్ కుటుంబానికి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిపై ఉన్న భక్తి చంద్రబాబు నాయుడు కుటుంబానికి లేవని తేల్చిపడేశారు. క్రీస్టియన్ మతస్తుడైన జగన్, హిందువైన సిఎం చంద్రబాబు నాయుడు కంటే భక్తుడా? అదెలా? అంటే…
“జగన్మోహన్ రెడ్డి తండ్రి పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన తండ్రి పేరు రాజారెడ్డి. ఆయన తండ్రి పేరు వెంకట్ రెడ్డి. స్వామివారిపై భక్తితో జగన్ ముత్తాతగారి తండ్రిగారు తన కొడుకుకి వైఎస్ వెంకట్ రెడ్డి అని ఆరోజుల్లోనే పేరు పెట్టుకున్నారు.
కనుక జగన్ ముత్తాతల కాలం నుంచే తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి భక్తులని చెప్పేందుకు ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది?” అని ప్రశ్నించారు. ఈవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా అన్నమయ్య కంటే గొప్ప భక్తుడని గోరంట్ల మాధవ్ తేల్చి చెప్పేశారు. కనుక అందరూ ఒప్పేసుకోవాల్సిందే.
మరి చంద్రబాబు నాయుడు కుటుంబానికి శ్రీవారి భక్తులు కారని గోరంట్ల మాధవ్ ఎలా కనిపెట్టగలిగారు? అంటే దానికీ ఇదే లాజిక్ ఉపయోగించి కనిపెట్టారు.
చంద్రబాబు నాయుడు మొదలు ఆయన కొడుకు, మనవడు, చంద్రబాబు నాయుడు తండ్రి, తాత, ముత్తాతలు వరకు ఎవరి పేరులో తిరుమల స్వామివారిని సూచించే ‘వెంకట’ లేదు. కనుక వారందరూ భక్తి హీనులే. అలాంటి భక్తి హీనులా మా అధినేత జగన్ని విమర్శిస్తారు?వారికి నైతిక హక్కే లేదని గోరంట్ల మాధవ్ తేల్చి పడేశారు.
చంద్రబాబు నాయుడు కుటుంబానికి భక్తి లేదని, జగన్ కుటుంబానికి మాత్రమే భక్తి ఉందని అందరూ ఒప్పేసుకోవాల్సిందే. కల్తీ నెయ్యి, పరకామణి, పట్టువస్త్రాలు, డిక్లరేషన్ అంటూ పిచ్చి ప్రశ్నలు వేయకూడదు. అంతే!






