మాజీ మంత్రి గౌతు శివాజీ కుమార్తె, తెలుగుదేశ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష రాజకీయాలలో చాలా చురుకుగా పాల్గొంటారని అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా చురుకుగా ఉంటారు. కనుక అందుకు ఏపీ సిఐడి పోలీసులు ఓ నోటీస్ కూడా ఇచ్చారు. అది వేరే కధ.
ఆమె ఈరోజు తెలంగాణలో నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కరెన్సీ విధానం అమలులోకి రాని రోజుల్లో ప్రజలు వస్తు మార్పిడి చేసుకొనేవారని ఇప్పుడు ఆ విధానంలో నేరాల మార్పిడి కూడా జరుగుతోందంటూ ట్వీట్ దానితో పాటు మూడు ఫోటోలు జత చేశారు.
మొదటి ఫోటోలో తెలంగాణ సిఎం కేసీఆర్, ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత ఫోటోలు వేసి “ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మీరు వదిలేయండి” అని కేంద్రాన్ని కోరుతున్నట్లు చూపగా, దాని కింద మరో ఫోటోలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోటోలు వేసి “ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మేము వదిలేస్తాం,” అని చెపుతున్నట్లుగా వేశారు. వాటి కింద మరో ఫోటోలో ఓ వైపు కేసీఆర్, మరోవైపు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, వారి మద్యలో తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ ఫోటో వేసి ఈ వ్యవహారంలో ఆయన మద్యవర్తిత్వం చేస్తున్నారని గౌతు శిరీష ట్వీట్ చేశారు.
ఈ నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ ఈ వ్యవహారంలో ఆయన మద్యవర్తిత్వం చేస్తున్నారనే ఎవరికీ తెలియని ఓ కొత్త విషయం గౌతు శిరీష బయటపెట్టారు. అయితే బిజెపితో పొత్తులు పెట్టుకోవాలని టిడిపి చూస్తున్నప్పుడు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న గౌతు శిరీష బిజెపికి ఇబ్బంది కలిగించే ఇటువంటి ట్వీట్ చేశారు. మరి దీనిని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చన్నాయుడు గమనించారో లేదో? గమనిస్తే ఏమంటారో? కానీ గౌతు శిరీష చెప్పినది అంటే ‘నేరాల మార్పిడి’ విధానం నూటికి నూరు శాతం నిజం అని అందరికీ తెలుసు.
పాత కాలంలో వస్తు మార్పిడి ఉండేది అని ఆర్థికశాస్త్రము లో చదువుకున్నాం, ఇప్పుడు నేరాలు మార్పిడి ఇలా ఉంటుంది మీ నేరానికి మా నేరం చెల్లు అని చెప్తున్న ప్రస్తుత రాజకీయ శాస్త్రం, నిజమే దేశం బాగా అభివృధి చెందింది,ఒప్పుకుంటున్నాను pic.twitter.com/IKBnCELvQD
— Gouthu Sireesha (@gouthusireesha) October 28, 2022



