గుజరాత్‌లో తీవ్ర విషాదం… తీగల వంతెన కూలి 132 మంది మృతి

Gujarat Cable Bridge Collapseదేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ప్రధమస్థానంలో ఉన్న గుజరాత్‌ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం అనూహ్యమైన ప్రమాదం జరిగింది. మోర్బీ నగరంలో మచ్చు నదిపై సుమారు 150 సంల క్రితం బ్రిటిష్ కాలంలో నిర్మించిన తీగల వంతెన నిన్న అకస్మాత్తుగా తెగిపోవడంతో ఆ సమయంలో దానిపై ఉన్న సుమారు 500 మంది సందర్శకులు నదిలో పడిపోయారు. వారిలో 177 మందిని ప్రాణాలతో కాపాడగా, నావికాదళం, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు నదిలో గాలింపు చర్యలు చేపట్టి ఇప్పటివరకు 132 మృతదేహాలను వెలికితీశాయి. ఇంకా గాలింపు కొనసాగుతోంది.

ఈ తీగల వంతెన బలహీనపడటంతో సుమారు ఏడు నెలలుగా మూసివేసి మరమత్తులు చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 26వ తేదీన తిరిగి తెరిచారు. నిన్న ఆదివారం కావడంతో వందలాదిమంది ప్రజలు దానిపైకి చేరుకొని సరదాగా తిరుగుతుండగా, అంత బరువుని తట్టుకోలేక తీగలు తెగిపోవడంతో వంతెన నదిలో కూలిపోయింది. దానిపై ఉన్న కొందరు నదిలో మునిగిపోగా మరికొందరు, వంతెన తీగలను పట్టుకొని వ్రేలాడుతూ ప్రాణాలు కాపాడుకొన్నారు. నదిలో పడిపోయిన పురుషులలో కొంతమంది అతికష్టం మీద ఒడ్డుకు ఈదుకొని వచ్చి ప్రాణాలు కాపాడుకొన్నారు.

ADVERTISEMENT

ఈ తీగల వంతెనకు ఏడు నెలల మరమత్తులు చేసిన తర్వాత ఎటువంటి భద్రతాపరమైన పరీక్షలు చేయకుండానే తెరిచి ప్రజలను అనుమతించడం, వంతెనపైకి వెళ్ళేవారిని నియంత్రించకపోవడం వలననే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమిక దర్యాప్తులో తేలింది. సమాచారం అందగానే గుజరాత్‌ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ ఘటనాస్థలానికి చేరుకొని సహాయచర్యలను స్వయంగా పర్యవేక్షించారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా ఈరోజు ఉదయం ఘటనాస్థలానికి చేరుకొన్నారు. ఈ ప్రమాదంపై ఐదుగురు సభ్యులతో కూడా కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా వంతెనకు మరమత్తులు చేపట్టిన కాంట్రాక్టర్‌తో సహా ఆ పనులను పర్యవేక్షించిన అధికారులు, ఇంజనీర్లపై కటిన చర్యలు తీసుకొంటామని తెలిపారు.

ఈ ప్రమాదం జరిగినప్పుడు ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్‌లోనే కేవడియాలో సర్దార్ వల్లభ్ బాయ్‌ పటేల్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ విషాద ఘటనపై స్పందిస్తూ, “నేను తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్నందున మోర్బీకి చేరుకోలేకపోతున్నాను. కానీ అక్కడ జరిగిన ఈ విషాదఘటనతో నా మనసంతా తీవ్రమైన ఆవేదనతో నిండిపోయింది. గుజరాత్‌ ముఖ్యమంత్రి, హోంమంత్రి ఘటనాస్థలానికి చేరుకొని అవసరమైన చర్యలు తీసుకొంటున్నారు. సహాయచర్యలలో ఎటువంటి లోపమూ ఉండబోదని నేను హామీ ఇస్తున్నాను. చనిపోయినవారి కుటుంబాలకు నా సానుభూతి, ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నాను,” అని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories