దేశమంతా ఏపీ వైపు తిరిగేలా పాలన చేస్తానని చెప్పిన జగన్ సర్కార్ గురించి దేశమంతా ఏమి అనుకుంటుందో పక్కన పెడితే, పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు మాత్రం ఓ కామెంట్ రూపంలో బయట పెట్టారు. అయితే ఇదేదో జగన్ ప్రభుత్వానికి కితాబు ఇచ్చే కామెంట్ కాదు, ఓ విధంగా జగన్ సర్కార్ కు అవమానకరమైన కామెంట్ గా పేర్కొనవచ్చు.
ఉద్యోగుల జీతభత్యాల అంశాన్ని ప్రస్తావించిన హరీష్ రావు, దేశంలో ఎక్కువ జీతాలు ఇచ్చేది తెలంగాణ రాష్ట్రమేనని పేర్కొన్నారు. ఇక్కడితో ఆగితే, ఏపీ ప్రస్తావన వచ్చేది కాదు. “పక్క రాష్ట్రంలో జీతాలు తగ్గి ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చారు” అంటూ ప్రస్తుత ఏపీ తీరును ఉద్దేశించి మాట్లాడారు. ఈ మాటలు ఉద్యోగస్తుల కంటే ఎక్కువగా జగన్ సర్కార్ నే ఇబ్బంది పెడుతున్నాయి.
ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయం వలనే ఉద్యోగులు రోడ్డెక్కిన వైనం తెలిసిందే. అంతేగాక, కేసీఆర్ సర్కార్ ఉద్యోగస్తులకు కావాల్సినదంతా ఇస్తోందని, జగన్ సర్కార్ మాత్రం ఉద్యోగస్తులను రోడ్డు మీద పడేసిందన్న భావనలో హరీష్ రావు చేసిన కామెంట్స్ రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి. మరి దీనికి వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
వైసీపీ ప్రభుత్వంపై ఎవరు నెగటివ్ కామెంట్ చేసినా వారిపై ఎదురుదాడి చేయడమే గత రెండేళ్లుగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తూ వస్తున్నారు. మరి పొరుగు రాష్ట్ర మంత్రిపై కూడా అదే రకమైన దూకుడును కొనసాగిస్తారా? లేక అందులో ఉన్న ఆంతర్యాన్ని అర్ధం చేసుకుని, మరోసారి ఇంకో ప్రభుత్వం తమపై ఎలాంటి నెగటివ్ కామెంట్ చేయకుండా జాగ్రత్త పడతారా?



