గతేడాది తనకో విషయం తెలిసిందని, ఓ జాతీయ పార్టీకి అనుబంధంగా ఉన్న ఓ సంస్థకు సంబంధించిన కల్యాణ్ జీ అనే ఓ వ్యక్తితో సదరు జాతీయ పార్టీ కుట్ర పన్నుతోందని సినీ హీరో, ప్రత్యేక హోదా సాధన సమితి నేత శివాజీ అన్నారు. కల్యాణ్ జీ అనే ఆ వ్యక్తి ప్రస్తుతం కర్ణాటక నుంచి ఆ జాతీయపార్టీకి అనుబంధంగా పని చేస్తున్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ జాతీయ పార్టీ ఆపరేషన్ పేరు మీరందరు అనుకుంటున్నట్లు ఆపరేషన్ గరుడ కాదు… ఆపరేషన్ ద్రవిడ. అలాగే తమిళనాడు, కేరళలో ఆపరేషన్ రావణ అని, కర్ణాటకకు సంబంధించిన ఆపరేషన్ పేరు కుమార అని పేర్లు పెట్టారని సంచలన విషయాలు వెల్లడించారు.
ఇందుకు సంబంధించిన విషయాలన్నింటినీ ఓ పెన్డ్రైవ్లో పొందుపర్చానని త్వరలోనే అందరికీ ఇస్తానని, అందులో పూర్తి వివరణ ఇస్తానని తెలిపారు. ఓ కొత్త నాయకుడిని ఆ జాతీయ పార్టీ పావులా వాడుకుంటోందని, ఏపీ మీద ఆధిపత్యం చెలాయించడానికి ఎటువంటి చర్యలు చేపట్టారో తాను తెలుపుతానని, మొత్తం 4,800 కోట్ల రూపాయలు ఓ జాతీయ పార్టీ ఈ ఆపరేషన్ ల కోసం కేటాయించిందని అన్నారు. వైట్ టేబుల్ పై శివాజీ వివరించిన విధానం ఆయన మాటల్లోనే…
“ఓ జాతీయ పార్టీ ఉంది. ఆపరేషన్ ద్రవిడను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తోంది. ఈ ఆపరేషన్ను ఎవరు డీల్ చేస్తారనే విషయాన్ని తెలుసుకుందాం.. ఏపీకి సంబంధించి మూడు టార్గెట్లు పెట్టుకుంది. 1.అధికార పార్టీ 2.ఓ కొత్త రాజకీయ నాయకుడు 3.ఇంకో ముఖ్యపార్టీ. మొదటిది – టార్గెట్ అధికార పార్టీ : సీబీఐ కేసులని రీ ఓపెన్ చేయడం, ఆర్థికంగా దెబ్బ తీయడం, చక్ర బంధం చేయడం, ఆ పార్టీని చివరకు ఒంటరిని చేయడం తద్వారా నిర్వీర్యం చేయడం ఈ వ్యూహ లక్ష్యాలు.
2. కొత్త నాయకుడు: తాను పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు పాపం ఈ నాయకుడికి తెలియదు. స్థానిక ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడం ఈయన లక్ష్యం. ఇందులో భాగంగా ఈయన ప్రజలకు కొన్ని మాటలు చెబుతారు. రాష్ట్రం పట్ల తనకు చాలా బాధ్యత ఉన్నట్లు, సమాజం పట్ల ప్రేమ ఒలకబోస్తాడు. రాజకీయాల్లోంచి వైదొలగిన కొందరు నాయకులని ఈ కొత్త నాయకుడు కలుస్తాడు. వాళ్లు ఈ కొత్త నాయకుడికి సహకరిస్తుంటారు. ప్రభుత్వాన్ని ఎలా డిస్టర్బ్ చేయాలనే విషయాన్ని వారు ఈ కొత్త నాయకుడికి చెబుతుంటారు. మన తెలుగువారికి సహజంగా ఉండే (డబ్బు) స్వార్థాన్ని ఆ జాతీయ పార్టీ ఉపయోగించుకుంటోంది.
3.ఇంకో ముఖ్యపార్టీ: నేరం నిరూపితం కాలేదు కాబట్టి ఈ పార్టీ ముఖ్య నాయకుడు ఇంకా నిందితుడు మాత్రమే. అసలు బలి పశువులు వీరే. ఈ విషయం వీరికి తెలియదు. జాతీయ పార్టీలో తేలికగా చేరొచ్చని వీళ్లు అనుకుంటున్నారు. జాతీయ పార్టీయే కావాలనే ఈ ముఖ్య పార్టీ కోసం దారులు తెరిచింది. ఈ ముఖ్య పార్టీ నాయకుడి మీద గుంటూరు, హైదరాబాద్లో ఇప్పటికే రెక్కీ నిర్వహించారు. పకడ్బంధీగా ప్రాణ హానీ లేని దాడి చేస్తారు. దీంతో ఈ రాష్ట్రంలో అలజడులు మొదలవుతాయి. అదే సమయంలో కొన్ని విషయాల్లో (కేసుల్లో) ఈ ముఖ్య నాయకుడికి ఊరటలు లభిస్తాయి. పూర్తి ఊరట మాత్రం రాదు. పెండింగ్ లో ఉంటుంది.
అదే సమయంలో బీహార్, ఒడిశా నుంచి వచ్చి కొందరు రాష్ట్రంలో అల్లర్లు మొదలు పెడతారు. ఫైనల్ గా… సెప్టెంబరు 1న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. అదే చివరి తేదీ.. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చి ఆ నాయకుడు మొదటి సారిగా ఇదే రోజున ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం ఎన్నికల్లో కొత్త నాయకుడికి, ఏపీలోని ముఖ్య పార్టీకి సీట్లు పడతాయి. ఎన్నికల తరువాత ముఖ్య పార్టీకి చెందిన వ్యక్తిని కూడా కేసుల్లో చివరకు జైలుకి వెళ్లేలా చేస్తారు. ఇక ఈ కొత్త నాయకుడిని కేంద్ర మంత్రిగా ఉండాలని చెబుతారు. కేంద్ర మంత్రిగా ఉండడం ఇష్టం లేక ఆ కొత్త నాయకుడు అలిగి వెళ్లిపోతాడు.
చివరకు ఇప్పటి అధికార పార్టీలోని నేతలు మరో పార్టీలోకి వెళతారు. జాతీయ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ముఖ్యమంత్రి ఎవరవుతారంటే… ఆ పార్టీకి చెందిన ఓ తెలుగు వ్యక్తి అవుతారు… అప్పటికే కొత్త నాయకుడు ద్వారా ప్రత్యేక హోదా అంశాన్ని నిర్వీర్యం చేస్తారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఓ వ్యక్తి కోవర్టుగా కూడా పనిచేస్తున్నారు. అధికారం, డబ్బు ఆశ అన్ని కల్పిస్తారు. చివరకు నష్టపోయేది మన రాష్ట్రమే. నాకు ఏ పార్టీపై కోపం లేదు. ఆ జాతీయ పార్టీ వేసిన ప్లాన్లో చిక్కుకుపోవద్దు. నాకు తెలిసిన విషయాలను చెప్పాను. మీ రాజకీయ భవిష్యత్తు కోసం, స్వార్థం కోసం తెలుగు తల్లిని అవమానంలోకి నెట్టకండి” మేల్కొండి అంటూ పిలుపునిచ్చారు.



