టీడీపి, జనసేనలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మునుపటి కంటే చాలా బలంగా మారిందనేది వాస్తవం. ఎన్నికలలో ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి ఏవిదంగా ఉండేది… నేడు భోగీ పండుగ రోజు ఏవిధంగా ఉందో పోల్చి చూసుకుంటే ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది.
జగన్మోహన్ రెడ్డి నేటికీ బెంగళూరు, తాడేపల్లి, పులివెందుల ప్యాలస్ల మద్యనే తిరుగుతున్నారు తప్ప పెద్దగా బయటకు రావడం లేదు. కానీ ఆయన ఒక్క సైగ చేయగానే పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ రోడ్లపైకి వచ్చి ర్యాలీలు, ఆందోళనలు చేస్తున్నారు.
జగన్ పిలుపు మేరకు నేడు వైసీపీ నేతలు భోగీ మంటల్లో మెడికల్ కాలేజీల కోసం కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రతులను తగులబెట్టారు. ఇలాంటివి రాజకీయాలలో సర్వసాధారణమే అని లైట్ తీసుకోవచ్చు. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతల మద్య ఇంత ఐఖ్యాత లేదు. కానీ ఇప్పుడు వైసీపీ నేతలందరూ కలిసికట్టుగా పోరాడుతున్నారు.
ఇదివరకు టీడీపి, జనసేనలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటి అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఆ పార్టీ ముఖ్య నేతలు కాళ్ళు అరిగిపోయేలా జనంలో తిరిగారు. అనేక ప్రజా ఉద్యమాలు చేశారు.
కానీ జగన్ ప్యాలస్లో నుంచి కాలు బయటపెట్టకుండానే పార్టీ శ్రేణులను చురుకుగా పనిచేయిస్తున్నారు. ఈవిధంగా పార్టీని నడిపిస్తుంటే జగన్ ప్రజల మన్ననలు పొందగలరా లేదా అనేది ఇప్పుడు చర్చ అనవసరం.
కానీ కూటమి ప్రభుత్వం ఊహించని విధంగా, తనదైన శైలిలో జగన్ పార్టీని నడిపిస్తున్నారనేది కళ్ళకు కనబడుతున్న వాస్తవం.
మరో విషయం ఏమిటంటే, వైసీపీలో ‘రప్పా రప్పా’ అంటూ హడావుడి చేసే కార్యకర్తలు మొదలు సీనియర్ నాయకులు వరకు అందరూ మరో ఆలోచన చేయకుండా, దిక్కులు చూడకుండా జగన్ నాయకత్వాన్ని నమ్ముకున్నారు.
ఆయనకు జై కొడుతున్నారు. ఆయన కోసం ‘రప్పా రప్పా’ అంటూ నడిరోడ్డుపై కోళ్ళు, మేకలు కోసి కేసులు నమోదు చేయించుకోవడానికి వెనకాడటం లేదు.
సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఏదో సందర్భంలో ఓ విమర్శ లేదా ఎద్దేవాతో సరిపెడుతుండటం గమనిస్తే వైసీపీని లైట్ తీసుకుంటున్నారా? అని సందేహం కలుగుతుంది.






