కేసీఆర్‌, రేవంత్… ఇదే తేడా!

How Revanth Reddy Balances Delhi Ties and Telangana Politics

జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు బద్ధ శత్రువులు. నిత్యం పరస్పరం విమర్శించుకుంటూనే ఉంటాయి. ప్రతి ఎన్నికలో ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడుతూనే ఉంటాయి. కనుక ఆ శత్రుత్వం కాంగ్రెస్‌ పాలనలో ఉన్న తెలంగాణ తదితర రాష్ట్రాలపై ఎంతో కొంత ప్రభావం చూపుతూనే ఉంటుంది.

కానీ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో సఖ్యతగా, విధేయంగా వ్యవహరిస్తూ తమ పార్టీల రాజకీయ శత్రుత్వం వలన తెలంగాణకు నష్టం కలగకుండా జాగ్రత్త పడుతుంటారు. అందువల్లే తెలంగాణకు రైల్, రోడ్ ప్రాజెక్టులు, అనేక పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయి.

ADVERTISEMENT

సిఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసి ఈ నెల 8, 9 తేదీలలో హైదరాబాద్‌లో జరుగబోయే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ హాజరు కావాలని ఆహ్వానించడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మెరుగు పరచుకోవడం కోసం చేసిన మరో మంచి ప్రయత్నమే. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు, నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల్లోనే ప్రధాని మోడీతో సత్సంబంధాలే ఉండేవి. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చేసరికి కేసీఆర్‌లో ఆత్మవిశ్వాసం అతిశయం, అహంభావంగా మారింది.

అప్పటి నుంచి ప్రధాని మోడీపై కత్తులు దూస్తూ, అవహేళన చేస్తూ పదేపదే అవమానించారు. ఈ ధోరణి వలననే తెలంగాణకు చివరికి సొంత పార్టీకి తీరని నష్టం జరిగింది.
కానీ ఆయన కంటే వయస్సులో, రాజకీయ–పరిపాలన అనుభవంలో చాలా చిన్నవారైన రేవంత్ రెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

అది చాలా గొప్ప విషయమే కానీ ఇటు పార్టీలో అంతర్గతంగా, కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి, బయట బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక పరిమితులు కారణంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేయలేకపోతున్నారు.

మరో విషయం ఏమిటంటే, కాళేశ్వరం కేసులో సీబీఐ విచారణ జరిపించమని కోరుతున్నా కేసీఆర్‌, హరీష్ రావులపై చర్యలు తీసుకోవడం లేదని సిఎం రేవంత్ ఆరోపిస్తున్నారు.

కానీ ఇదే సమయంలో ఎఫ్-1 రేసింగ్ కేసులో కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చినా, అడుగు ముందుకు వేయలేని నిసహాయతని ప్రతిపక్షాలే ప్రశ్నిస్తున్నాయి.

ఒక పక్క ఈ కేసులు, మరో పక్క ఇన్ని రాజకీయ ఒత్తిళ్ళు, వాటికి తోడు ఆర్థిక సమస్యలు, పరిమితులు మద్య సిఎం రేవంత్ రెడ్డి నలిగిపోతున్నారు.

గతంలో కేసీఆర్‌కి వడ్డించిన విస్తరిలా తెలంగాణ చేతికి లభించింది. ఆయనకు ఇలాంటి సమస్యలు ఏవీ ఉండేవి కావు. కానీ ఇలాంటి పరిస్థితులన్నీ అగ్నిపరీక్షలు పెడుతుంటే సిఎం రేవంత్ రెడ్డి వాటన్నిటినీ చాలా గుండె నిబ్బరంతో ఎదుర్కొని అధిగమిస్తూ పాలన సాగిస్తుండటమే చాలా గొప్ప విషయం.

పైగా బద్ధ శ్రత్రువు బీజేపి (కేంద్ర ప్రభుత్వం)తో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకునే ప్రయత్నం కత్తి మీద సామే… కానీ రేవంత్ రెడ్డి అన్నిటినీ ఏకకాలంలో చక్కబెడుతున్నారు. ఇందుకు ఆయనని అభినందించాల్సిందే!

ADVERTISEMENT
Latest Stories