హైదరాబాద్ మెట్రో రోజుకి సుమారు 4.50 లక్షల మంది ప్రయాణికులతో నిత్యం కిటకిటలాడులాడుతుంటుంది. ఇప్పుడు నగర ప్రజలు మెట్రోపై ఎంతగా ఆధారపడ్డారంటే, మెట్రో రైల్ 5 నిమిషాలు ఆలస్యమైన భరించలేకపోతున్నారు.
టికెట్ ఛార్జీలు కాస్త ఎక్కువే అయినప్పటికీ ఐటి, ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, వ్యాపారులు, కాలేజీ విద్యార్ధులు మెట్రోలోనే ప్రయాణిస్తుంటారు.
హైదరాబాద్ మెట్రోకి నగరంలో హైటెక్ సిటీ, ఎర్రమంజిల్, పంజాగుట్ట, ముషీరాబాద్లో ఆ సంస్థకు వేలకోట్లు విలువగల 269 ఎకరాలు లీజుపై హక్కులు కలిగి ఉంది. వాటిలో భారీ షాపింగ్ మాల్స్, ఐటి కార్యాలయాలు నిర్మించి అద్దెల రూపంలో భారీగా ఆదాయం సమకూర్చుకుంటోంది.
కనుక ఆర్ధికంగా చాలా ధృడంగా ఉన్నట్లే కనిపిస్తుంది. కానీ హైదరాబాద్ మెట్రో అప్పుల ఊబిలో కూరుకుపోయి, వాటి నుంచి బయట పడేందుకు అమ్మకానికి సిద్ధపడింది.
కానీ హైదరాబాద్లో ఇప్పుడు మెట్రో సర్వీసులని ఎట్టి పరిస్థితులలో ఆపలేని పరిస్థితి నెలకొంది. పైగా దాని విస్తరణకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. ఇప్పుడు ఎల్&టి తప్పుకుంటే ముందుకు సాగడం కష్టం. కానీ అది ఈ ప్రాజెక్టులో నుంచి బయటపడాలనుకుంటోంది.
కనుక సాంకేతికంగా ఇది అవరోధంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
ఈ పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం మెట్రోను కాపాడుకోక తప్పదు.
ఎల్&టి బకాయిలు మొత్తం రూ.13,000 కోట్లు, అదనంగా దాని ఈక్విటీకి మరో రూ.2,000 కోట్లు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అయినా ఈ ప్రాజెక్టులో ప్రభుత్వంతో భాగస్వామిగా ఉండేందుకు ఎల్&టి నిరాకరించింది.
ఈ చెల్లింపుతో హైదరాబాద్ మెట్రో (మొదటి దశ) మొత్తం తెలంగాణ ప్రభుత్వం చేతికి వచ్చింది కనుక రెండో దశ విస్తరణ పనులకు సాంకేతిక అవరోధం తొలగిపోతుంది. దేశంలో తొలిసారిగా ఓ మెట్రో ప్రాజెక్ట్ పూర్తిగా ప్రభుత్వం అధీనంలోకి వస్తోంది.
కానీ ఎల్&టి వంటి అత్యంత నైపుణ్యం, అనుభవం కలిగిన సంస్థ హైదరాబాద్ మెట్రోని నిర్వహించలేక చేతులు ఎత్తేస్తే, పాలన విషయంలోనే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ఏవిదంగా నడిపించగలదు? ఆర్ధిక సమస్యలతో సతమతమవుతూ ఎన్నికల హామీలు అమలుచేయలేకపోతున్న తెలంగాణ ప్రభుత్వం మెట్రో రెండో దశ విస్తరణ పనులు ఏవిదంగా పూర్తి చేయగలదు?అసలు హైదరాబాద్ మెట్రో రైళ్ళు ఎంత కాలం నడిపించగలదు? నడిపించకపోతే పరిస్థితి ఏమిటి? అనే సందేహాలు అప్పుడే వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ రాబోయే రోజుల్లో తప్పక సమాధానాలు లభిస్తాయి.
కానీ విజయవాడ, విశాఖలో మెట్రో ఏర్పాటు చేయాలని తహతహలాడుతున్న ఏపీ ప్రభుత్వానికి హైదరాబాద్ మెట్రోలో జరుగుతున్న ఈ పరిణామాలు కనువిప్పువంటివే. కనుక మెట్రో ఏర్పాటుకి తొందరపడకుండా సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం.





