హైదరాబాద్ మెట్రోలో రోజుకి సుమారు నాలుగున్నర లక్షల మంది ప్రయాణిస్తుంటారు. మెట్రోకి నగరం నడిబొడ్డున వేలకోట్లు విలువ చేసే భూములు (లీజు) కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని చోట్ల మెట్రో మాల్స్ నిర్మించింది. అయినా మెట్రో నష్టాలలో కూరుకుపోవడంతో దానిని నడిపిస్తున్న ఎల్&టి కంపెనీ చేతులెత్తేసింది.
దాని పెట్టుబడి, బకాయిలతో సహా అన్నీ చెల్లించి, హైదరాబాద్ మెట్రోని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇకపై మెట్రో బాధ్యత ప్రభుత్వానిదే కనుక హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు దానికి చైర్మన్గా ఐఏఎస్ అధికారి సర్పరాజ్ అహ్మద్ ఎండీ, కమీషనర్గా ఉంటారు. డిజిపి బి.శివధర్ రెడ్డితో సహా మరో నలుగురు ఐఏఎస్ అధికారులను బోర్డు డైరెక్టర్లుగా నియమించింది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఇటీవల ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసి ఒప్పించారు. కానీ ఎవరూ ఒప్పించకుండానే హైదరాబాద్ మెట్రోని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది!
కానీ అంతమాత్రన్న మెట్రో ఉద్యోగులు అందరినీ ప్రభుత్వంలోకి తీసుకున్నట్లు కాదు. కానీ భవిష్యత్లో ఏదో ఓ రోజు వారి నుంచి ఈ డిమాండ్ తప్పక రావచ్చు.
సమ్మె చేస్తే ఉద్యోగాలలో నుంచి పీకేస్తామని ముందే నియామక పత్రాలలో షరతులు ఉన్నాయి కదా? అని అనుకోవచ్చు.
కానీ ప్రతీ వ్యవస్థని రాజకీయాలు ప్రభావితం చేసి కలుషితం చేస్తున్నప్పుడు మెట్రో వాటికి అతీతంగా ఉండలేదు కదా? కనుక మెట్రోలో సమ్మె ప్రమాదం పొంచి ఉన్నట్లే భావించవచ్చు.
ఓట్ల కోసం ప్రభుత్వ అధీనంలో నడిచే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నప్పుడు, ప్రభుత్వం చేతికి వచ్చిన హైదరాబాద్ మెట్రోలో కూడా కల్పించాలనే ఆలోచన చేయకుండా ఉంటుందా? చేస్తే మెట్రో పరిస్థితి?
మెట్రో లాభదాయకత కాదు. అప్పులు, వడ్డీలు కూడా ఉన్నాయి. నిర్వహణ భారం ఉండనే ఉంది. భవిష్యత్లో ఇలాంటి సమస్యలు కూడా పొంచి ఉన్నాయి.
కనుక ఏపీ ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టుకి దూరంగా ఉండటమే మంచిదని స్పష్టమవుతోంది. హైదరాబాద్ మెట్రో కథ చూసిన తర్వాత ఏపీ మెట్రోకి ప్రభుత్వం నిధులు సమకూర్చుకోలేకపోవడం, అనుమతులు లభించడంలో ఆలస్యం, డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ ప్రతిపాదనకు కేంద్రం తిరస్కరణ.. వంటివన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరాలుగానే పరిగణించవచ్చు.
రోజుకి నాలుగున్నర లక్షల మంది ప్రయాణించే హైదరాబాద్ మెట్రోతోనే చేతులు కాలినప్పుడు, దానిలో సగం మంది కూడా ప్రయాణికులు లేనప్పుడు మెట్రోతో ఏపీ ప్రభుత్వం చేతులు కాల్చుకోవడం అవసరమా?ఆలోచిస్తే మంచిది.




