తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక సంచనల నిర్ణయం ‘హైడ్రా’.
హైద్రాబాద్ లో ఉన్న నాళాలను, చెరువులను ఆక్రమించి కట్టుకున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత కు రేవంత్ వదిలిన బాణమే ఈ హైడ్రా. అయితే ఒక స్వతంత్ర ప్రతిపత్తిగా రూపొందించిన హైడ్రా తనదైన స్టైల్ లో హైద్రాబాద్ వాసులను భయాందోళనలోకి నెట్టింది. హైడ్రా ఆవిర్భావానికి కారణం మంచిదైనా చాల కుటుంబాలలో హైడ్రా కన్నీటినే మిగిల్చింది.
“హైద్రాబాద్ డిజాస్టర్ రెస్పాన్ అండ్ ఎసెట్ మోనిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ” పేరుతో రేవంత్ హైదరాబాద్ నగర శివారులలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. తమ కళ్ళ ముందే తమ కలల సౌథం కుప్పకూలిపోతుంటే ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో వాటి యజమానులు కన్నీరుమున్నీరుగా రోధించారు.
అలాగే రేవంత్ సర్కార్ ను శపించారు. గతంలో హైద్రాబాద్ లో వీకెండ్స్ అంటే పార్టీలు, పబ్ క్లచర్లు కనిపించగా, హైడ్రాతో వీకెండ్స్ అంటే కూల్చివేతలు, కన్నీటి శోకాలు అన్నటుగా మారిపోయింది. ఒకానొక దశలో హైడ్రా హైద్రాబాద్ బ్రాండింగ్ ని కుప్పకూలిస్తుంది అంటూ బిఆర్ఎస్ ఆరోపణలకు దిగింది.
అలాగే నేటి హైడ్రా చర్యలే రేపటి బిఆర్ఎస్ పురోగతికి పునాదులు అంటూ బిఆర్ఎస్ హైడ్రా కూల్చివేతలలో తన భవిష్యత్ ని వెతికే ప్రయత్నం చేసింది. అటువంటి హైడ్రా బిఆర్ఎస్ ను తిరిగి పుంజుకునేలా చేసిందా.?
హైద్రాబాద్ లో గులాబీ కారుకున్న వేగాన్ని తిరిగి అందుకునేలా చేసిందా అంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో హైడ్రా పై బిఆర్ఎస్ పెంచుకున్న ఆశలన్నీ ఒక్కసారిగా పార్టీ ఓటమి రూపంలో కుప్పకూలిపోయాయి. అయితే నాడు హైడ్రా సాధించలేనిది నేడు హిల్ట్ సాధిస్తుందేమో అనే ఆశలో బిఆర్ఎస్ తిరిగి రేవంత్ సర్కార్ పై రాజకీయం మొదలుపెట్టింది.
‘హైద్రాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్’ పేరుతో రేవంత్ సర్కార్ వేలకోట్ల భూ కుంభకోణానికి పాల్పడుతుందంటూ టి. బీజేపీ బృందం రాష్ట్ర గవర్నర్ ను కలిసి తమ వినతి పత్రం అందించింది.
ఇక ప్రతిపక్ష బిఆర్ఎస్ విషయానికొస్తే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హిల్ట్ పేరుతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న భూ దోపిడీని అడ్డుకోవాలంటూ కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీకి లేఖ రాసారు.
గతంలో తెలంగాణ పారిశ్రామిక్భివృద్ది కోసం కేటాయించిన సుమారు 9 వేల ఎకరాల భూమిని రేవంత్ సర్కార్ రియల్ ఎస్టేట్ కోసం విక్రయిస్తుందంటూ బీజేపీ ఆరోపిస్తుంటే, కాంగ్రెస్ చర్యలతో తెలంగాణ ప్రజలకు దాదాపు 5 లక్షల కోట్ల ఆస్తి నష్టం తప్పదు అంటూ బిఆర్ఎస్ వాదిస్తుంది.
మరి హైడ్రాతో ఏకమవ్వలేకపోయిన బిఆర్ఎస్ – బీజేపీ హిల్ట్ తో ఒకేతాటి మీదకు వచ్చారు. మరి ఈ రెండు పార్టీల ఆరోపణలు, విమర్శలు కాంగ్రెస్ పార్టీని అడ్డుకోగలవా.? తద్వారా ఈ రెండు పార్టీలు కూడా రాజకీయ లబ్దిని పొందగలవా.?
బిఆర్ఎస్ హైడ్రాతో సాధించలేనిది హిల్ట్ సాధించగలుగుతుందా.? తన ఆరోపణలతో, విమర్శలతో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ప్రజలు ముందు దోషిగా నిలబెట్టగలుగుతుందా.? రేవంత్ సర్కార్ అవినీతిని నిరూపించగలుగుతుందా.?






