మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎంట్రీతో గుంటూరు జిల్లా తాడికొండ అదనపు వైసీపీ ఇన్ఛార్జిగా ఎంట్రీ ఇవ్వడంతో వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి టెన్షన్ మొదలైంది. ఆమె స్వయంగా అనుచరులతో కలిసి జిల్లా పార్టీ ఇన్ఛార్జి ఇంటి ఎదుట ధర్నా చేసి నిరసన తెలిపినా అధిష్టానం పట్టించుకోలేదు.
రెండు రోజుల క్రితం డొక్కా మాణిక్య వరప్రసాద్ అనుచరులు, ఎమ్మెల్యే శ్రీదేవి వర్గంతో తాడికొండలో పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించేందుకు సిద్దపడ్డారు. తద్వారా తాము వెనక్కు తగ్గేది లేదని డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేసినట్లయింది. తాడికొండ వైసీపీ అదనపు ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నియోజకవర్గంపై పట్టు పెంచుకొనేందుకు డొక్కా తన అనుచరులను వెంటపెట్టుకొని రోజూ పట్టణంలో పర్యటిస్తూ పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
సోమవారం తాడికొండ నియోజకవర్గంలోని పేరేచర్ల కైలాసగిరి శివాలయంలో స్వామివారిని దర్శించుకొన్న తర్వాత ఆయన చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“ఎమ్మెల్యే శ్రీదేవి తండ్రి, సోదరులు నాతో కలిసి పనిచేశారు. కనుక ఆమెకు నాతో కలిసి పనిచేయడానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదని భావిస్తున్నాను. నాకూ ఆమెతో కలిసి పనిచేయడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఆమెకు అన్యాయం జరుగదు. ఆమె రాజకీయ భవిష్యత్ గురించి జగన్ చూసుకొంటారు. తప్పుడు పనులు చేసే కొంతమంది ఆమెను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆమె కలిసివస్తే సిఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి మా మద్య సమస్యల గురించి మాట్లాడేందుకు నేను సిద్దంగా ఉన్నాను. నా రాజకీయ గురువు రాయపాటి అంటే నాకు చాలా గౌరవం కానీ ఇప్పుడు నా బాస్ సిఎం జగన్మోహన్ రెడ్డి. కనుక ఆయన ఏం చెపితే అది ఫాలో అవుతాను,” అని అన్నారు.
“ఎమ్మెల్యే శ్రీదేవికి అన్యాయం జరుగదు… జగన్ ఆమె భవిష్యత్ చూసుకొంటారని,” డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పడం చూస్తే వచ్చే ఎన్నికలలో మళ్ళీ ఆమెకు తాడికొండ టికెట్ లభించదని, అది తనకే లభిస్తుందని నమ్మకంతో చెప్పినట్లు అర్దమవుతోంది.
ఎమ్మెల్యే శ్రీదేవి ఈ విషయం ముందే గుర్తించారు కనుకనే ఆందోళనతో ధర్నా చేసినట్లు అర్దమవుతోంది. కానీ డొక్కా ఇంత నమ్మకంగా చెపుతుంటే ఆయనను శ్రీదేవి ఏవిదంగా ఎదుర్కొంటారో?



