ప్రభుత్వం చెప్పినట్లు పనిచేయడమే నేరమా?

IAS & IPS Under Political Pressure in Telangana

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రభుత్వోద్యోగులు అందరూ తప్పనిసరిగా ప్రభుత్వం చెప్పినట్లే పని చేయాల్సి ఉంటుంది. వారు రాజకీయాల జోలికి పోరాదు. రాజకీయాలపై వారి సొంత అభిప్రాయాలు వ్యక్తం చేయరాదు.

కానీ అధికారంలోకి వచ్చినవారు తమతమ పార్టీల సొంత రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అందుకు అనుగుణంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటారు. అభివృద్ధి పనులలో ఆ రాజకీయ మార్క్ చాలా స్పష్టంగా కనబడుతుంటుంది.

ADVERTISEMENT

అధికారంలో ఉన్న పార్టీకి, ప్రభుత్వానికి మధ్య మొదట్లో చాలా బలమైన రేఖే ఉండేది. కానీ అది క్రమంగా సన్నబడి, కనిపించని ఆక్షాంశాలు, రేఖాంశాల్లా కంటికి కనబడని రేఖగా మారిపోయింది. అందువల్లే అధికార పార్టీ అంటే ప్రభుత్వమని అందరూ భావిస్తున్నారు.

రాజకీయ నాయకులు అందరూ కలిసి ప్రభుత్వానికి, అధికార పార్టీకి మధ్య గీత చెరిపేసినందునే, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రభుత్వోద్యోగులు ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడికీ భయపడుతూ పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు.

ఈ కారణంగా అధికారుల పరిస్థితి ‘కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకి కోపం’ అన్నట్లు మారిందంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వానికి విధేయంగా పని చేయాలి. అధికార పార్టీ నేతలు చెప్పినట్లూ పని చేయాలి.

కానీ వారు చెప్పినట్లు చేస్తే ప్రతిపక్ష నేతలకు కోపం వస్తుంది. వస్తే బెదిరింపులూ ఉంటాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఉద్యోగులు ఇలా కత్తి మీద సాము చేసినందుకు ప్రతిఫలం ఏమిటి? అంటే ప్రమోషన్లు కావచ్చు.

కానీ ప్రభుత్వం మారగానే ఈ విధేయతే వారి మెడకు ఉరితాడులా బిగుసుకుంటుంది. ఏబీ వెంకటేశ్వరరావు, టీటీడీ ఉన్నతాధికారులు, మాజీ అధికారులు మొదలు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు వరకు అందరూ రాజకీయాల్లో బలిపశువులవుతూనే ఉన్నారు.

ఉదాహరణకు ఫోన్ ట్యాపింగ్ చేసిన నేరానికి ఆ కేసులో చిక్కుకున్న డీఎస్పీ ప్రణీత్ రావు ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యారు. జైలుకి వెళ్లారు. తాజాగా డీఎస్పీ పదవి కూడా ఊడిపోయింది.

మళ్లీ ఎస్సైగా మార్చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎందువల్ల? అంటే కారణాలు పైనే చెప్పుకున్నాం. కానీ అధికారుల చేత చేయకూడని పనులు చేయించుకున్న రాజకీయ నాయకులు మాత్రం సింపుల్‌గా చేతులు దులిపేసుకుంటున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు భూటకమని వాదిస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులే ఆ కేసు విచారణకు నోటీసులు అందుకుంటే దానినీ వారు తమ రాజకీయ ప్రమోషన్లుగా మార్చి వాడేసుకుంటున్నారు.

అంతేకాదు… త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ‘తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే’నంటూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు.

అంటే ఈ వాదనతో ప్రజల సానుభూతి సంపాదించుకొని ఎన్నికల్లో లబ్ది పొందాలనుకుంటోందన్న మాట! కనుక ప్రభుత్వోద్యోగులు, మరీ ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగి తప్పులు చేస్తుంటే చివరికి వారే మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

తప్ప వారి చేత ఆ తప్పులు చేయించిన ప్రభుత్వం అలియాస్ అధికార పార్టీ నేతలు కారు. కనుక ఒత్తిళ్లు భరిస్తూ నిబంధనల ప్రకారమే పనిచేయడం మంచిదా? లేదా గుడ్డిగా చెప్పినట్లు చేసుకుపోతూ పదోన్నతులు పొంది ఆనక ఇలా శేషజీవితం కేసులను మెడకు తగిలించుకొని తిరగడం బాగుంటుందా?

ఏది మేలు? అని ఎవరికీ వారు ఆలోచించుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories