ప్రస్తుతం జగన్ బయటే ఉన్నారు కనుక వైసీపీకి ఎటువంటి సమస్యా లేదు. కానీ ఏదో రోజు మద్యం కుంభకోణం కేసులో జగన్ జైలుకి వెళ్ళాల్సి వస్తే? వైసీపీ పరిస్థితి ఏమిటి?ఆయన తరపున పార్టీని ఎవరు నడిపిస్తారు?అని ఆలోచిస్తే సమాధానం చెప్పడం కష్టమే.
ఎందుకంటే, జగన్ తల్లిని, చెల్లిని, విజయసాయి రెడ్డి వంటి వీరవిధేయుడినే నమ్మలేదు! వారు ముగ్గురూ జగన్ కోసం, పార్టీ కోసం ఎంతగానో శ్రమించారు. కష్టనష్టాలు, అవమానాలు భరించారు. అటువంటివారినే జగన్ నమ్మనప్పుడు, పార్టీలో ఇతరులను నమ్ముతారనుకోలేము.
కనుక ఒకవేళ జగన్ జైలుకి వెళితే ఆయన సతీమణి భారతి పార్టీని నడిపించాల్సి ఉంటుంది. తద్వారా ఆమెకు ప్రజల సానుభూతి లభిస్తుంది కనుక జగన్ లేని లోటు కనపడకుండా పార్టీని నడిపించుకోగలరు.
ఒకవేళ ఆమె బయటకు రాదలచుకోకపోతే, పార్టీలో సీనియర్స్ అయిన బొత్స సత్యనారాయణ లేదా సజ్జల రామకృష్ణా రెడ్డిలను ముందు పెట్టి పార్టీ నడిపించుకునే అవకాశం ఉంది.
మద్యం కుంభకోణం కేసులో భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని భావిస్తున్నందున ఈడీ కూడా విచారణ జరుపుతోంది.
కనుక ఒకవేళ ఈ కేసులో జగన్ అరెస్ట్ అయితే బయటకు రావడానికి చాలా సమయం పట్టవచ్చు. కనుక జగన్ బయటకు వచ్చే వరకు వైసీపీని నడిపించగల సమర్ధుడు అవసరం.
జగన్ తమతో ఉన్నప్పుడే వైసీపీ ముఖ్య నేతలు కేసులకు భయపడి బయటకు రావడం మానుకున్నారు. ఆయన లేనప్పుడు ఎక్కువ హడావుడి చేస్తే తమకూ అదే గతి పడుతుందని ఎవరూ బయటకు రాకపోవచ్చు.
జగన్పైనే వైసీపీ ఆధారపడి నడుస్తునందున అదిప్పుడు ప్రమాదం అంచున ఉందని చెప్పక తప్పదు. కనుక ఆయన అరెస్ట్ అయితే వైసీపీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారినా ఆశ్చర్యం లేదు.
కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు, కూటమి పాలనపై, సిఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ విలువైన సమయం వృధా చేసుకునే బదులు, తాను లేనప్పుడు వైసీపీని ఎవరు నడిపించాలో, ఎలా నడిపించాలో జగన్ ఇప్పుడే నిర్ణయించుకుంటే మంచిది.




