తెలంగాణలో అధికార బిఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తున్న ఇద్దరు కాంగ్రెస్ నేతల ఇళ్ళపై 24 గంటల వ్యవధిలో ఐటి దాడులు జరిగాయి. వారే తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
వారిద్దరూ మూడు నెలల క్రితం వరకు బిఆర్ఎస్ పార్టీలోనే ఉండేవారు. కేసీఆర్ వారిని పక్కన పెట్టేయడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇద్దరూ ఖమ్మం జిల్లాకే చెందిన కాంగ్రెస్ నేతలు కావడం గమనార్హం. ఈరోజు వారు నామినేషన్స్ వేసేందుకు సిద్దపడుతుంటే, ఐటి రెయిడ్స్ జరగడం యాదృచ్ఛికంగా భావించలేము.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ, “బీజేపీ, బిఆర్ఎస్ నేతలే ఇళ్ళపై ఐటి దాడులు జరుగవు. కానీ బిఆర్ఎస్కు గట్టి పోటీ ఇస్తున్న మా వంటి కాంగ్రెస్ నేతల ఇళ్ళపై మాత్రమే ఐటి దాడులు జరుగుతుంటాయి. బిఆర్ఎస్, బీజేపీల మద్య రహస్య అవగాహన ఉందని చెప్పేందుకు ఈ ఐటి దాడులే నిదర్శనం.
బిఆర్ఎస్తో కత్తులు దూస్తూ యుద్ధం చేస్తున్నట్లు బీజేపీ నటిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీకి తోడ్పడేందుకు ఈవిదంగా కాంగ్రెస్ నేతలని ఐటి దాడులతో భయపెట్టాలని ప్రయత్నిస్తోంది. బిఆర్ఎస్, బీజేపీ రెంటికీ ఓటమి భయం పట్టుకొందని ఈ ఐటి దాడులే సూచిస్తున్నాయి,” అని అన్నారు.
ఇదివరకు బిఆర్ఎస్ నేతల ఇళ్ళపై కూడా ఐటి దాడులు జరిగాయి. అప్పుడు బిఆర్ఎస్ కూడా ఇలాగే వాదించింది. ఈడీ, ఐటిలను తమపై ఉసిగొలిపి భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కానీ తాము తగ్గేదేలే అని తేల్చి చెప్పింది. అప్పుడు ఏ ఎన్నికలు జరుగడం లేదు కనుక బిఆర్ఎస్ వాదనలు సహేతుకంగానే ఉన్నాయని అందరూ భావించారు.
ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ మద్యలో బిఆర్ఎస్కి గట్టి పోటీనిస్తున్న కాంగ్రెస్ నేతల ఇళ్ళపైనే ఐటి దాడులు జరుగుతుండటంతో బిఆర్ఎస్ కోసమే కేంద్రం ఈ దాడులు చేయిస్తోందనే వారి వాదనలు సహేతుకంగానే ఉన్నాయి కదా?




