ఈ ఏడాది మే 7-10 వరకు భారత్-పాక్ మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగింది. ఇది భారత్ సత్తాని, పాక్ నిసహాయతని మరోసారి లోకానికి చాటి చెప్పింది. కానీ భారత్లో కాంగ్రెస్ మిత్ర పక్షాలు, మోడీ వ్యతిరేక శక్తులు మాత్రం నేటికీ ఇది అంగీకరించలేదు. ఈ యుద్ధంలో భారత్ పైచేయి సాధించిందని అంగీకరించడమంటే మోడీ ఘనతని ఒప్పుకున్నట్లే అవుతుందని అవి భావించడమే ఇందుకు కారణం.
అవి ఒప్పుకున్నా లేకున్నా భారత్ సత్తాని పాకిస్తాన్తో సహా ప్రపంచదేశాలు గుర్తించాయి. అది చాలు!
కానీ ‘ఆ యుద్ధాన్ని నేనే అపానని’ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేపదే చెప్పుకున్నారు. కానీ ‘కాదు మేమే ఆపించామని’ ఇప్పుడు చైనా అంటోంది. ఆ రెండు దేశాల ప్రమేయం లేకుండా భారత్-పాక్ డీజీఎంఓ స్థాయిలో చర్చలు జరిపి యుద్ధవిరమణ చేశామని భారత్ చెపుతోంది.
ఈ యుద్ధ విరమణ క్రెడిట్ కోసం అమెరికా, చైనాలు ఎందుకు పోటీ, తాపత్రయపడుతున్నాయి? అనే సందేహం కలుగుతుంది. బహుశః తమ దేశ ప్రజలలో తమ ప్రభుత్వ గ్రాఫ్ పెంచుకోవాలని కావచ్చు. లేదా భారత్ వంటి శక్తివంతమైన దేశాన్ని తాము శాశించగలమని లోకానికి చాటుకోవడం కోసం కావచ్చు.
నిజానికి ఇది భారత్-పాక్ మద్య జరిగిన యుద్ధం కానే కాదు. భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతొ ఏకపక్షంగా పాక్పై దాడులు చేయగా… వాటిని అడ్డుకునేందుకు పాక్ చేసిన ప్రయత్నాలుగానే దీనిని అభివర్ణించవచ్చు. దీనినే భారత్-పాక్ యుద్ధమని అందరూ చెప్పుకుంటున్నారు.
అమెరికా, చైనాలు ఎల్లప్పుడూ భారత్ కంటే పాకిస్తాన్కే ఎక్కువ మొగ్గు చూపుతాయనేది రహస్యమేమీ కాదు. అందువల్లే అవి భారత్ నుంచి పాక్ని కాపాడేందుకు భారత్పై ఒత్తిడి చేసి ఉండొచ్చు. కానీ ఈ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే భారత్ ఆర్ధిక వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతుందనే విజ్ఞత భారత్కు ఉంది.
కనుకనే అవి ఒత్తిడి చేసినా చేయకపోయినా భారత్ దాడులు నిలిపివేసింది. కనుకనే ఈ క్రెడిట్ కోసం అవి పోటీ పడుతున్నాయి. లేకుంటే అవీ పాక్ పక్కన చేరి భారత్తో యుద్ధం చేయకుండా ఉంటాయా?




