అంటిగ్వాలో వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ విజయం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 566 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, వెస్టిండీస్ జట్టు 243 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఫాలో ఆన్ ఆడాల్సిన పరిస్థితిలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
తొలి ఇన్నింగ్స్ లో 74 పరుగులు చేసి జట్టును ఆదుకున్న ఓపెనర్ బ్రాత్ వైట్, రెండో ఇన్నింగ్స్ లో 2 పరుగులకే శర్మ బౌలింగ్ లో ఎల్ బీడబ్ల్యూగా అవుటై పెవీలియన్ దారి పట్టాడు. దీంతో రెండు పరుగుల వద్దే కీలక వికెట్ కోల్పోయిన విండీస్ జట్టు 13 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 21 పరుగుల వద్ద మూడవ రోజు ఆట ముగిసింది.
ఇక ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ తేడాతో భారత్ విజయం సాధించాలంటే, మరో 9 వికెట్లు తీయాల్సివుంది. ఇక వెస్టిండీస్ కోలుకొని అద్భుతంగా ఆడి మరో 302 పరుగులకన్నా ఎక్కువ చేయగలిగితేనే ఇన్నింగ్స్ తేడా పరాజయాన్ని తప్పించుకోగలుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కాస్త కస్టమే. విండీస్ తోలి ఇన్నింగ్స్ లో డోవ్రిక్ 57, హోల్డర్ 36 పరుగులతో కాస్తంత ఫర్వాలేదనిపించగా, మిగతావాళ్లు ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, మహమ్మద్ సామీలు చెరో నాలుగు వికెట్లు తీయగా, మిశ్రా 2 వికెట్లు తీశారు.



