లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్, బిజెపి కూటములు పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలో బిజెపిని వ్యతిరేకిస్తున్న 26 రాజకీయపార్టీలు సోమవారం బెంగళూరులో సమావేశమవుతున్నాయి.
బిజెపి కూడా 30 మిత్రపక్షాలతో మంగళవారం ఢిల్లీలో సమావేశం కానున్నది. ఈ రెండు సమావేశాలతో ఈ రెండు కూటముల బలాబలాలు చాటుకోబోతున్నాయి కనుక ఇవి దేశ రాజకీయాలపై చాలా ప్రభావం చూపవచ్చు.
ముందుగా నేడు బెంగళూరులో జరుగుతున్న బిజెపియేతర పార్టీల సమావేశం గురించి రెండు ముక్కలు చెప్పుకోవలసి ఉంది.
తెలంగాణ సిఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తునందున, దేశంలో అన్ని పార్టీలు తన నాయకత్వంలో పనిచేయాలని కోరుకొంటున్నందున ఈ సమావేశానికి వారు ఆయనను ఆహ్వానించలేదు. కనుక వెళ్ళలేదు.
దేశంలో కేసీఆర్ ఏకైక స్నేహితుడు ఆమాద్మీ అధినేత, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్దమయ్యరన్న మాట!
ఏపీలో అధికార వైసీపీ కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీదే మనుగడ సాగిస్తోంది కనుక ఈ సమావేశానికి ఆహ్వానం రాలేదు. కనుక వెళ్ళలేదు. అలాగే టిడిపి కూడా బిజెపితో స్నేహం పునరుద్దరించుకోవాలనుకొంటోంది కనుక అదీ ఈ సమావేశానికి వెళ్ళలేదు. రేపు ఢిల్లీలో జరుగబోయే ఎన్డీయే సమావేశానికి టిడిపికి ఆహ్వానం వచ్చిన్నట్లు వార్తలు వచ్చాయి కానీ బిజెపికి మిత్రపక్షంగా ఉన్న జనసేనకు మాత్రమే ఆహ్వానం వచ్చిన్నట్లు తెలుస్తోంది.
బహుశః అందుకే చంద్రబాబు నాయుడు ఈ (ఎన్డీయే) సమావేశం గురించి మాట్లాడి చులకన కాదలచుకోలేదని అన్నారేమో?ఒకవేళ రేపటి ఎన్డీయే సమావేశానికి టిడిపి హాజరుకాకపోతే ఏపీలో టిడిపి-బిజెపిపొత్తులు లేన్నట్లే భావించవచ్చు.
ఇక తెలంగాణలోని బిఆర్ఎస్ విషయానికి వస్తే, ఒకానొక సమయంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్డీయే కూటమిలో చేరి, కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వం పదవి చేపడతారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆ తర్వాత కేసీఆర్ బిజెపిని వ్యతిరేకిస్తూ మోడీని గద్దె దించుతానని శపధాలు చేస్తున్నందున ఎన్డీయే సమావేశానికి పలుపు రాలేదు. ఆయన వెళ్ళడంలేదు.
ఇప్పుడు ఈ రెండు సమావేశాలను చూస్తే, నేడు బెంగళూరులో జరుగుతున్న బిజెపియేతర పార్టీల సమావేశంలో, అవి తమ ప్రధాన అభ్యర్ధి ఎవరు?అనే విషయంపై నేడు చర్చించుకొని ప్రకటించగలిగితేనే వాటిని ప్రజలు నమ్ముతారు. కానీ అవి అలా ప్రకటించిన మరుక్షణమే విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. వారి కూటమిలో రాహుల్ గాంధీ, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ తదితరులు ప్రధాని కావాలని ఆశపడుతున్నారు.
అయితే కాంగ్రెస్, మిత్రపక్షాలు తమ తమ రాష్ట్రాలలో బలంగా ఉన్నాయి. కనుక అవన్నీ చేతులు కలిపి నిలబడగలిగితే ఎన్డీయేకు బలమైన ప్రత్యామ్నాయంగా నిలువగలవు.
రేపు జరుగబోయే ఎన్డీయే సమావేశంలో ప్రధాని అభ్యర్ధి ఎవరనే ప్రశ్నే ఉండదు. వాటి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీయే కనుక వాటి సమావేశం అర్దవంతంగా ఉన్నట్లు భావించవచ్చు. తమతో కలిసి వచ్చే పార్టీలేవో తెలుసుకొనేందుకే బిజెపి ఈ సమావేశం నిర్వహించబోతున్నట్లు భావించవచ్చు.



