స్టార్ హీరోలు పొలిటికల్ పార్టీలు స్థాపించడం… ఆ తర్వాత మనుగడ కొనసాగించలేక వాటిని ఏదొక జాతీయ పార్టీలో కలిపేయడం… అనేది చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ విలీనంతో హైలైట్ అయ్యింది. ఇదే బాటలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కూడా పయనిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ‘కర్ణాటక ప్రజ్ఞాయవంత జనతా పార్టీ’ అంటూ స్థాపించిన ఉపేంద్ర, దానిని నిర్వహించడం కష్టసాధ్యంగా మారిన తరుణంలో… దానిని బిజెపిలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు పొలిటికల్ టాక్.
పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించని ఉపేంద్రపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం కావడం విశేషం. ఆయన ఓ నియంతలా ప్రవర్తిస్తున్నారంటూ కొందరు నేతలు తనపై తిరుగుబాటు ప్రారంభించారు. పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ… ఉపేంద్ర పెద్ద సినీ నటుడైతే కావొచ్చేమో కానీ పార్టీలో మాత్రం నియంతలా వ్యవహరిస్తున్నారని, మరో రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని, తామేం చెప్పినా వినిపించుకోవడం లేదని, దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని ఆరోపించారు.
అయితే పార్టీ మూసేస్తారంటూ వచ్చిన వార్తలను ఉపేంద్ర ప్రతినిధి ఆనంద్ ఖండించారు. ఆయనంటే గిట్టని వారే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, శివకుమార్ ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపడేశారు. రాజకీయాల్లో మార్పు రాత్రికి రాత్రే వచ్చేది కాదని, ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. కానీ ‘మార్చి 6న తాను అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నట్టు’ ఉపేంద్ర చేసిన ట్వీట్ పై మాత్రం రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా 6వ తేదీన బీజేపీలో చేరబోతున్నారని, ఆ ట్వీట్ లో ఉన్న పరమార్ధం ఇదేనని అంటున్నారు.



