అధికారంలో ఉన్నవారు ‘మళ్ళీ మనమే’ అనుకుంటారు. కుదిరితే మళ్ళీ మళ్ళీ మనమే అనుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నవారు ముఖ్యంగా… ఒకసారి అధికారంలోకి వచ్చి ఓడిపోయినవారు ‘ఈసారి తప్పకుండా మనమే’ అనుకుంటారు. అదో తుత్తి!
ఆ తుత్తి కోసం సొంత మీడియాలో పదేపదే వ్రాయించుకుంటారు. ఆ తుత్తి కోసం ఉగాది నాడు అనుకూల పంచాంగం చెప్పించుకుంటారు కూడా.
కానీ భారీ మెజార్టీతో గెలిచిన వారిని ప్రజలు గద్దె దించేస్తుంటారు. గద్దె దించినవారినే మళ్ళీ గద్దెపై కూర్చోబెడుతుంటారు. ఈ చిన్న నమ్మకంతోనే ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలు ‘ఈసారి మనమే’ అని కోరస్ పాడుతూనే ‘రప్పా రప్పా’ ట్యూన్ మార్చి పాడుకుంటున్నాయి. అదో తుత్తి!
అయితే ‘వైసీపీ మళ్ళీ ఎన్నటికీ వచ్చేదీ చచ్చేదీ లేదు’ అని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘అధికారంలోకి రావడం గురించి తర్వాత ఆలోచిద్దాం జగన్! ముందు ఆ తాడేపల్లి ప్యాలస్ బయటకు రమ్మంటే రావు. ఇప్పుడే కాదు ఏడాదిన్నర తర్వాత అంటున్నావు.
శాసనసభకు రావడానికి జగన్ భయపడుతున్నావు సరే కానీ ప్రజల మధ్యకు వచ్చేందుకు ఎందుకు భయపడుతున్నావు? ప్రజల వద్దకు వెళ్ళేందుకు కూడా ఇంత భయమైతే ఎన్నికలలో ఎలా గెలుద్దామనుకున్నావు? శాసనసభకి, ప్రజల వద్దకు వెళ్ళని మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలి? అని మంత్రి జనార్ధన్ రెడ్డి సూటి ప్రశ్నలు వేశారు.
జగన్ అజ్ఞాతవాసం సంగతి పక్కన పెడితే, అమరావతి, పోలవరంతో సహా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, పరిశ్రమలు, పెట్టుబడులు కళ్ళకు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూటమి నేతల మద్య సఖ్యత ఉంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు కూడా నానాటికీ బలపడుతున్నాయి. అంటే వచ్చే ఎన్నికల నాటికి కూటమి ప్రభుత్వానికి మరింత అనుకూలమైన వాతావరణం నెలకొంటుందన్న మాట!
కనుక మంత్రి జనార్ధన్ రెడ్డి చెప్పినట్లుగా, శాసనసభకు, ప్రజల మధ్యకు రాని తనని ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు? అని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తే మంచిది.






