కవిత గెలుపు బిఆర్ఎస్ ఓటమా.?

Is Kavitha Victory BRS Loosing

బీసీలకు 42 % రిజర్వేషన్ అమలుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలపడంతో తెలంగాణలో రాజకీయం మరో ములుపు తీసుకోనుంది. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి ప్రకటించారు.

అయితే ఈ 42 శాతం బీసీ ల రిజర్వేషన్ అంశాన్ని ఎత్తుకుని తన కొత్త రాజకీయ ప్రయాణానికి బాటలు వేసుకున్న జాగృతి అధ్యక్షురాలు కవిత ఇది తమ విజయంగా పేర్కొన్నారు. దానికి తగ్గట్టే జాగృతి సిబ్బందితో కలిపి సంబరాలు చేసుకున్నారు.

ADVERTISEMENT

బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటూ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తానూ స్వాగతిస్తున్నాని, అలాగే ఇచ్చిన మాట ప్రకారం కాలయాపన చేయకుండా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలంటూ కవిత డిమాండ్ చేసారు.

బీసీ రిజర్వేషన్ల పై ఆర్డినెన్స్ తీసుకొస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయంతో కవిత తన జాగృతి సంస్థ పేరు మీద పిలుపునిచ్చిన రైలు రోకో కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. ఇదంతా తాము ప్రభుత్వం పై చేసిన ఒత్తిడి కారణంగానే జరిగిందని, ఇది తమ జాగృతి తొలి విజయంగా ప్రకటించారు కవిత.

అయితే బిఆర్ఎస్ ఎమ్మెల్సీ గా కొనసాగుతున్న కవిత తన పోరాటం ఫలితంగానే ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణలో బీసీ ల రిజర్వేషన్లకు ఆర్డినెన్స్ తీసుకొస్తామని ప్రకటించిందని, ఈ క్రెడిట్ మొత్తాన్ని తన జాగృతి ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్ లో తనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన, తండ్రి పార్టీ అయిన బిఆర్ఎస్ ప్రస్తావనే కవిత తీసుకురాలేదు.

గత పదేళ్లు అధికారంలో ఉండి కూడా కవిత బీసీ ల రిజర్వేషన్ అంశాన్ని లేవనెత్తలేదు కానీ ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో అందునా పార్టీ తరుపున కాకుండా సొంత పోరాటాలతో కవిత ప్రభుత్వాన్ని దారికి తెచ్చిందంటే ఇది కవిత సాధించిన విజయంగా భావించాలా.? లేక ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ ఓటమిగా పరిగణించాలా.?

కేసీఆర్ కారులోనే ఉంటూ గులాబీ జెండాను పక్కన పెట్టి కవిత జాగృతి పేరు మీద చేస్తున్న రాజకీయాలు బిఆర్ఎస్ పార్టీకి ఊహించని రాజకీయ నష్టాన్ని తెచ్చే ప్రమాదం ఉందా.? కవిత గులాబీ కారు నీడలో, తెలంగాణ సెంటిమెంట్ మాయలో జాగృతిని రాజకీయంగా బలపరిచేందుకు ప్రణాళికలు వేస్తున్నారా.?

అందులో భాగంగానే బీసీ రిజర్వేషన్ల అంశం నుంచి పోలవరం ముంపు ప్రాంతాల విలీనం వరకు ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ ఫోకస్డ్ గా కవిత రాజకీయంగా ఎలర్ట్ అయ్యారా.? బనకచర్ల అంశంలో కూడా కవిత బిఆర్ఎస్ కంటే ఒక అడుగు ముందే ఉంటున్నారు.

బనకచర్ల నిర్మాణంతో భద్రాద్రి ముంపు కు గురవుతుందంటూ కవిత కొత్త వివాదాన్ని తెరమీదకు తెచ్చారు. అలాగే పోలవరం ముంపు మండలాలను తెలంగాణలో విలీనం చెయ్యాలంటూ ఏపీ ముఖ్యమంత్రి బాబు కి లేఖ కూడా సంధించారు. ఇలా కవిత బిఆర్ఎస్ పార్టీ కంటే తన జాగృతిని ఒక అడుగు ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బిఆర్ఎస్, బీజేపీ వంటి బలమైన పార్టీలు ఉన్నప్పటికీ వాటన్నిటిని వెనక్కి నెట్టి కవిత తన జాగృతిని ప్రచారంలో ఉంచడంలో మాత్రం తొలి విజయం అందుకున్నారని చెప్పొచ్చు.

ADVERTISEMENT
Latest Stories