కూటమి పాలనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా తన పంచాయితీ రాజ్ శాఖలో నవీన మార్పులు, గిరిజన మారుమూల కొండ ప్రాంతాలలో రోడ్లు, తాగు నీరు, కరెంట్ వంటి మౌలిక వసతుల కల్పన వంటి ఏర్పాటులతో ముందుకెళ్తున్నారు.
అలాగే ఇటు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూడా పవన్ ప్రభుత్వ పాలన లో తన ముద్ర వేస్తున్నారు. అయితే అవి ఒక్కోసారి అటు కూటమి ప్రభుత్వానికి ఇటు జనసేన పార్టీకి సానుకూలలంగా మారితే మరి కొన్నిసార్లు ఆ నిర్ణయాలు, దూకుడు స్వభావాలు ప్రభుత్వాన్ని, పార్టీని ఇబ్బందులలో పడేస్తున్నాయి.
ఉదాహరణకు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంలో పవన్ అనుసరించిన సనాతన ధర్మం కాన్సెప్ట్ పవన్ రాజకీయానికి మత ముద్ర వేసాయి. అలాగే కాకినాడ పోర్ట్ లో అక్రమ రేషన్ పట్టివేత అంటూ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ నడి సముద్రంలో సీజ్ ది షిప్ అంటూ ప్రకటించారు.
అయితే పవన్ చేసిన ఆ ఒక్క ప్రకటన అటు జనసేనలో ఇటు కూటమి ప్రభుత్వంలో ఆ నిముషానికి మంచి జోష్ తెచ్చిన మాట వాస్తవమే అయినప్పటికీ ఆ తరువాత జరిగిన పరిణామాలతో జనసేన తో పాటు పవన్ ను విమర్శలలో నెట్టాయి.
సీజ్ ది షిప్ ఏమయ్యింది.? ఆ అక్రమ రేషన్ రవాణా ఎటుపోయింది.? ఆ తరువాత ప్రభుత్వం చేపట్టిన చర్యలేమిటి.? పవన్ తీసుకున్న నిర్ణయాలేంటి.? సీజ్ ది షిప్ అంటూ చేసే ప్రకటనలు కేవలం సినిమా ట్రిక్సేనా.? ద్వారం పూడి పై చర్యలేవి.? అంటూ ఇలా పలు రకాల ప్రశ్నలు పవన్ ను టార్గెట్ చేసాయి.
ఇక తాజాగా ఎర్రచందనం స్మగ్లింగ్, ఎర్రచందనం అక్రమ రవాణా, అటవీ భూముల ఆక్రమణలు అంటూ పవన్ అక్రమార్కుల పై, దోపిడీదారుల పై తాటతీస్తా అంటూ ప్రదర్శించిన దూకుడు ఆపరేషన్ పుష్ప అన్నట్టుగా ఆయన చేసిన ప్రకటనలు పరిపూర్ణత సాధిస్తాయా.? అన్న సందేహాలు ఎదురవుతున్నాయి.
శేషాచలం కబ్జా సామ్రాజ్యం…మంగళం పేట అటవీ భూముల ఆక్రమణలు అంటూ పవన్ చేపట్టిన ఈ మిషన్ సీజ్ ది షిప్ మాదిరి అర్దాంతరంగా ఆగిపోతుందా.? లేక పరిపూర్ణంగా కొనసాగి పవన్ చెపుతున్నట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పై చర్యల దిశగా ముందుకెళ్తుందా.?






