కేంద్రప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రముఖ సినీ కధా రచయిత విజయేంద్ర ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్), ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (తమిళనాడు), ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వీరేంద్ర హెగ్గడే (కర్నాటక) పరుగుల రాణి పిటి ఉష (కేరళ) లను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేసింది. రాజ్యసభకు నామినేట్ అయిన నలుగురు ప్రముఖులు దక్షిణాది ప్రజలందరికీ చిరపరిచితులు. దక్షిణాది ప్రజలకు ఇది చాలా సంతోషకరమైన విషయమే. అయితే కేంద్రప్రభుత్వానికి దక్షిణాది రాష్ట్రాల మీద హటాత్తుగా ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకువచ్చిందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు బలమైన కారణమే కనిపిస్తోంది.
బిజెపి దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించాలని ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ, దక్షిణాది ప్రజలు దానిని హిందీ పార్టీ లేదా ఉత్తరాది పార్టీ అని భావిస్తుండటంతో ఒక్క కర్ణాటకలో తప్ప మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో విస్తరించలేకపోతోంది. పైగా ముఖ్యమంత్రులు కేసీఆర్, పినరయి విజయన్ కేంద్రప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందని ఆరోపిస్తున్నారు కూడా.
బిజెపిపై పడిన ఈ ముద్రను తొలగించుకొని దక్షిణాది ప్రజలకు చేరువయ్యేందుకే ఈసారి నాలుగు రాజ్యసభ సీట్లకు దక్షిణాది ప్రముఖులను ఎంపిక చేసి ఉండవచ్చు. అయితే ఇటువంటి తాయిలాలతో బిజెపి దక్షిణాది రాష్ట్రాలలో విస్తరించగలదనుకోవడం అత్యశే అవుతుంది. ఈవిషయం బిజెపికి కూడా తెలుసు.
అందుకే ఏపీలో లోపాయికారిగా వైసీపీతో పైకి జనసేనతో, తమిళనాడులో అన్నాడీఎంకె పార్టీలతో పొత్తులు పెట్టుకొని చక్రం తిప్పాలని ప్రయత్నిస్తోంది. కానీ అదీ సాధ్యం కావడం లేదు. అయితే వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు ఒంటరిగానే పోరాడుతోంది. కానీ సిఎం కేసీఆర్, టిఆర్ఎస్ ప్రభావంలో ఉన్న తెలంగాణ ప్రజలు బిజెపిని ఆదరించి అధికారం కట్టబెడతారా?అంటే అనుమానమే.



